వైఎస్పై ఏడ్చావు కదా, ఇప్పుడేం చేస్తున్నావ్: కెసిఆర్పై ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులను కాంగ్రెసులో చేర్చుకుంటుంటే వైఎస్ రాజశేఖర రావు రెడ్డి మీద ఏడ్చిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేస్తున్నదేమిటని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. ప్రలోభపెట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలను, నాయకులను కెసిఆర్ లాక్కున్నారని ఆయన బుధవారం మీడియా సమావేశంలో ఆరోపించారు.
మాటల గారడీతో కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని, మోసం చేసే ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. కెసిఆర్ పద్ధతి మార్చుకోవాలని ఆయన హితవు చెప్పారు. టిడిపిని కెసిఆర్ ఏమీ చేయలేరని, టిడిపి అంతం చూడడానికి ప్రయత్నించిన ఇందిరా గాంధీ, పివి నరసింహారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి పోయారని, టిడిపిని నిర్మూలించడం కెసిఆర్తో సాధ్యం కాదని ఆయన అన్నారు.
కెసిఆర్ టిడిపిలోనే పుట్టి పెరిగారని, టిడిపి నాయకులనూ శాసనసభ్యులను టిఆర్ఎస్లోకి తీసుకుంటున్నారని ఆయన అన్నారు. కొడుకు పుడితే పాలిచ్చి పెంచి ప్రయోజకుడిని చేసిన తర్వాత అతన్ని ఎవరైనా ఎత్తుకుపోతే తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతారని, తమ పార్టీలో పుట్టి పెరిగిన తలసాని శ్రీనివాస యాదవ్, తుమ్మల నాగేశ్వర రావులను కెసిఆర్ ఎత్తుకుపోతే తాము బాధపడమా అని ఆయన అన్నారు.
రాజీనామా కూడా చేయించకుండా తలసాని శ్రీనివాస యాదవ్ను తీసుకుని మంత్రి పదవి ఇచ్చారని, అలాగే తుమ్మల నాగేశ్వర రావును టిడిపి ఎమ్మెల్యేను, మంత్రినీ చేసిందని, తుమ్మలను కూడా కెసిఆర్ ఎత్తుకుపోయారని ఆయన అన్నారు. తలసాని శ్రీనివాస యాదవ్కు మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఎసిబి గుర్తుకు రాలేదా అని ఎర్రబెల్లి అడిగారు.
ఎసిబిని అడ్డం పెట్టుకుని కెసిఆర్ కుట్రలు చేస్తున్నారని, చంద్రబాబును కెసిఆర్ అడ్డుకోలేరని ఆయన అన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలపై టిడిపికి హక్కు ఉందని ఆయన అన్నారు. అక్రమ కేసులకు తమ పార్టీ భయపడదని ఆయన అన్నారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు ఎల్ రమణ కూడా పాల్గొన్నారు.
కెసిఆర్ కాల్ డేటా తీయాలి...
2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ((టిఆర్ఎస్)లో ఎమ్మెల్యేల చేరికపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఎమ్మార్పీయస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ డిమాండు చేశారు. కేసీఆర్ కాల్ డేటా, ఎమ్మెల్యేలతో జరిపిన మంతనాలను దర్యాప్తు సంస్థలు బయటపెట్టాలన్నారు. ఓటుకు నోటు కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో విచారణ జరిపించాలని ఆయన కోరారు.