బాంబు పేల్చిన ఎర్రబెల్లి: కారెక్కే ఆ ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు ఎవరు?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకున్న తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీపై ఓ బాంబు పేల్చారు. మరో ముగ్గురు శాసనసభ్యులు తెరాసలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఎర్రబెల్లి ప్రకటనతో ఆ ముగ్గురు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది శాసనసభ్యులు గెలువగా ఇప్పటికే 9 మంది తెరాసలో చేరారు. కారెక్కే మిగతా ముగ్గురు ఎవరనే విషయంపై చర్చ సాగుతోంది.
కెసిఆర్కు సవాళ్ల మీద సవాళ్లు: టిడిపి చిత్తు, ఆ కేసే మలుపు తిప్పిందా?
తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, ఆర్. కృష్ణయ్య, రాజేందర్ రెడ్డి, అరికెపూడి గాంధీ, సండ్ర వెంకటవీరయ్య మిగిలిపోయారు. వీరిలో రేవంత్ రెడ్డి తెరాసలో చేరుతారని చెప్పడానికి వీల్లేదు. ఆయన కెసిఆర్పై పోరాటం చేసి, కుల సమీకరణ రాజకీయాల్లో తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని అనుకుంటున్నారు.
సండ్ర వెంకటవీరయ్య నోటుకు ఓటు కేుసులో చిక్కుకున్నారు. తెరాసలో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావును కోవర్టు అని కూడా వ్యాఖ్యానించారు. అందువల్ల ఆయన తెరాసలో చేరే అవకాశం లేదు. మాగంటి గోపీనాథ్ సామాజిక వర్గం దృష్ట్యా, తాజాగా ఆయన పేరు ఓటుకు నోటు కేసులో ముందుకు వస్తున్న దృష్ట్యా పార్టీ మారకపోవచ్చునని అంటున్నారు.
మిగిలి ముగ్గురిలో ఆర్. కృష్ణయ్య ఎల్బీ నగర్ నుంచి శాసనసభకు గెలిచారు. ఆయనకు బీసీల ఉద్యమం ముఖ్యం కాబట్టి ఆయన తెరాసలో చేరే అవకాశం లేదు. ఇక మిగిలింది ఇద్దరే. వారిలో అరికెపూడి గాంధీ, రాజేందర్ రెడ్డి. వీరి గురించి ఇప్పటికిప్పుడైతే ఏమీ తెలియడం లేదు. నిజానికి తెరాసకు తెలుగుదేశం నుంచి మరో ఎమ్మెల్యే వచ్చి చేరితే సరిపోతుంది.
ఫిరాయింపుల చట్టాన్ని అధిగమించి శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనం చేయడానికి అది సరిపోతుందని అనుకుంటున్నారు. వచ్చే బడ్డెట్ సమావేశాల్లోగా అది కూడా కొలిక్కి వస్తుందని అనుకుంటున్నారు.