Etala Rajender To Join BJP: హైదరాబాద్కు ఈటల..4న ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్కి రాజీనామా...
హైదరాబాద్: ఊహించని పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఢిల్లీకి పయనమైన రాజేందర్.. బీజేపీ అగ్రనేతలను కలిశారు. తాను బీజేపీలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేదానిపై చర్చించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా క్లారిటీ ఇవవడంతో కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు ఈటల రాజేందర్.
నేడు హైదరాబాద్ ఈటల..
గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్న ఈటల రాజేందర్.. శుక్రవారం (జూన్ 4)నాడు టీఆర్ఎస్ పార్టీ, హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇక జూన్ 8 లేదా 9 తేదీల్లో బీజేపీలో చేరాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. సోమవారం జేపీ నడ్డాను, మంగళవారం తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ను, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఆయన బుధవారం మరోమారు జాతీయ నాయకత్వంలో సమావేశమయ్యారు.
ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజీనామా.. బీజేపీలోకి
ఈటల రాజేందర్ తోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి.. తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్తో కలిసి బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్తో బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. తాను ముందు ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, ఆ తర్వాత మంచిరోజు చూసుకుని బీజేపీలో చేరతానని ఈటల రాజేందర్ వారితో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈటల తోపాటు మరో ఐదుగురు నేతలు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
Recommended Video
మీడియా సమావేశంలో ఈటల కీలక ప్రకటన
శుక్రవారం(జూన్ 4న) మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఈ క్రమంలో తర్వాత ఎదురయ్యే పరిణామాలను సమష్టిగా ఎదుర్కొనేందుకు, రాజీనామాతో వచ్చే ఉపఎన్నికలో ఈటల రాజేందర్ విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నాయకత్వం.
బీజేపీలోకి ఈటల రాకను వ్యతిరేకిస్తున్న పెద్దిరెడ్డిని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం బుజ్జగింపులు చేపట్టింది. మరోవైపు రాజా సింగ్, విజయశాంతి, డీకే అరుణ లాంటి నేతలు ఈటల రాకను స్వాగిస్తున్నారు. ఈటల తర్వాత చాలా మంది నాయకులు బీజేపీలో చేరతారని చెబుతున్నారు.