టీఆర్ఎస్, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా: కేసీఆర్, హరీశ్, కవితలపై సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఊహించిన విధంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీతో తనకున్న 19ఏళ్ల అనుబంధాన్ని ఆయన నేటితో తెంచుకున్నారు.
రాత్రికి రాత్రే మంత్రి పదవి నుంచి తొలగించారు..
ఎవరో అనామకుడు లేఖ రాస్తే ఒక మంత్రిపై ఎంక్వైరీ వేస్తారా? కేసీఆర్ సర్కారును అని ప్రశ్నించారు. ఏం జరిగిందో కూడా తెలుసుకోలేదన్నారు. రాత్రికి రాత్రే విచారణ జరిపి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా చివరి కోరిక అడుగుతారని అన్నారు. 20 ఏళ్ల చరిత్రలో టీఆర్ఎస్ పెద్దలు హుజురాబాద్ను కన్నెత్తి కూడా చూడలేదని ఈటల రాజేందర్ చెప్పారు. వందశాతం ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించిన చరిత్ర తనదని అన్నారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నట్లు తెలిపారు.
కేసీఆర్ బీ ఫాం ఇచ్చిన ప్రతిసారి గెలిచా.. కవిత ఓడిపోయింది
డబ్బులు, కుట్రలతో హుజురాబాద్ ఉపఎన్నికలో అధికార పార్టీ గెలుస్తుంది కావొచ్చదని ఈటల వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరని అన్నారు. హుజురాబాద్లో కేసీఆర్ బీ ఫాం ఇచ్చిన ప్రతిసారీ తాను గెలిచానని, అయితే, ఆయన కూతురు కల్వకుంట్ల కవిత ఓడిపోయారని ఈటల వ్యాఖ్యానించారు. అది ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్ అంటూ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసమే అవమానాలు భరించినట్లు తెలిపారు.
కేసీఆర్ గేటు నుంచే పంపించేశారు.. హరీశ్కు అవమానం
తాను మూడుసార్లు అపాయింట్ కోరినా ఇవ్వలేదని, గేటు ముందు నుంచే తిరిగి పంపించేశారని సీఎం కేసీఆర్పై ఈటల రాజేందర్ మండిపడ్డారు. తమ మధ్య ఐదేళ్లుగా గ్యాప్ వచ్చింది. బానిసగా ఉండే మంత్రి పదవి ఎందుకు? అని ప్రశ్నించారు. మంత్రి హరీశ్ రావుకు కూడా పలుమార్లు అవమానం జరిగిందని అన్నారు. సీఎంవో ఆఫీసులో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్ అధికారి ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదన్నారు.
అందుకే కేసీఆర్ దూరం పెట్టారు
టీఎన్జీవోలకు పీఆర్సీ ఆశ చూపారని మండిపడ్డారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లేకుండా చేశారని అన్నారు. కార్మికుల హక్కు సమ్మె చేయడమని, నిరసన చేయమని అన్నారు. తాను సంక్షేమ పథకాలను వ్యతిరేకించలేదని, వాటిలో లోపాలను వ్యతిరేకించినట్లు తెలిపారు. అధికార పార్టీ బెదిరింపులకు కొందరు లొంగిపోయారిన అన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రశ్నించినందుకే తనపై చర్యలు తీసుకున్నారని ఈటల తెలిపారు. కుక్కిన పేనులా పడి ఉండటం లేదనే తనను దూరం పెట్టారని అన్నారు.