జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ ఖర్చెంతో తెలుసు, ధర్మంవైపే ప్రజలు: కేసీఆర్పై ఈటల రాజేందర్ విమర్శ
హైదరాబాద్: బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి కేసీఆర్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. కేసీఆర్ను ఢీకొట్టే పార్టీ బీజేపీ మాత్రమేనని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితుల్లో లేదని ఆయన అన్నారు. శామీర్ పేటలోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీజేపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినా.. వారు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోతారనే ఓ భావన ప్రజల్లో ఏర్పడింది. కేసీఆర్ ప్రలోభాలతో లొంగదీసుకొని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ప్రలోభాలకు లొంగనిది బీజేపీ మాత్రమేనని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి.. బీజేపీ జెండాను తెలంగాణ రాష్ట్రంలో ఎగురవేయాలనే సంకల్పం ప్రతి కార్యకర్త తీసుకోవాలి. డబ్బుతోనే ప్రజలను తమవైపు తిప్పుకుంటామనుకుంటే అది పొరపాటే. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంత డబ్బు ఖర్చు చేసిందో తనకు తెలుసని ఈటల రాజేందర్ చెప్పారు. ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు చేసినా.. సందర్భం వచ్చినప్పుడు ధర్మాన్ని కాపాడేది ప్రజలేనని ఈటల స్పష్టం చేశారు.
ఇది ఇలావుండగా, జీహెచ్ఎంసీ కార్యాలయంలో దాడుల అంశంపై బీజేపీ కార్పొరేటర్లు వివరణ ఇచ్చారు. తాము జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎలాంటి దాడులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. బల్దియా జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని, అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. శాంతియుతంగా సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసుల తోపులాట వల్ల పూల కుండీలు ధ్వంసమయ్యాయని చెప్పారు.
ఇప్పటికైనా కౌన్సిల్ సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా, లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆందోళన చేసిన బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు ప్రజల ఆస్తిని ధ్వంసం చేసిన ఆరోపణలతో 32 మంది కార్పొరేటర్లపై సైఫా బాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన అనంతరం కార్పొరేటర్లతోపాటు వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తామని సైఫాబాద్ సీఐ తెలిపారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ కూడా చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ను కోరారు. ఈ క్రమంలో పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు.