భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండాలనే: ఈటెల రాజేందర్
వరంగల్: భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని తాము కోరుకుంటున్నామని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే దళిత కుటుంబానికి మూడెకరాల భూ పంపిణీకి శ్రీకారం చుట్టామని, ఈ పంపిణీ నిరంతరం కొనసాగుతుందన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం వరంగల్ వచ్చిన ఆయన హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో మీడియాతో మాట్లాడారు.
‘కేసీఆర్ మంత్రివర్గంలో వామపక్ష భావజాలం కలిగి ఉన్న మీరు మావోయిస్టు పార్టీ, ఇతర ప్రజా సంఘాలపై నిషేధం పొడిగింపు పట్ల ఎలా స్పందిస్తున్నారు' అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కూడా ఉంటుందన్నారు. ఈ అంశంపై అంతర్గత వేదికల్లో చర్చిస్తున్నట్లు చెప్పారు. వరంగల్కు హెల్త్ యూనివర్సిటీ మంజూరు చేయడం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వరం లాంటిదని వ్యాఖ్యానించారు.
జనాభాకు అనుగుణంగా వైద్యుల నియామకాన్ని చేపట్టాల్సి ఉందన్నారు. 57 ఏళ్లుగా వలస పాలనలో వివక్షకు గురైన రంగాల పునరుజ్జీవం కోసం కేసీఆర్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. బడ్జెట్లో విద్యా, వైద్య రంగానికి పెద్దపీఠ వేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంల్లో కొనసాగిన వివక్ష పాలనల ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రంలో కరెంట్ కోతలు విధించాల్సి వచ్చిందని మంత్రి రాజేందర్ చెప్పారు. 2017 మార్చి నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేలా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఖమ్మం జిల్లాలోని మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందులలో 6 వేల మెగావాట్లు, వరంగల్ జిల్లాలోని ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం బీహెచ్ఈఎల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీ సీతారాం నాయక్, జెడ్పీ చైర్ పర్సన్ జి.పద్మ, ఎమ్మెల్యేలు చందూలాల్, అరూరి రమేష్, బానోతు శంకర్నాయక్, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు, పార్టీ జిల్లా ఇన్చార్జి పెద్ది సుదర్శన్రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఇండ్ల నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.