ఈటల వ్యాఖ్యల రగడ: నేడు సాయంత్రం భాగ్యలక్ష్మీ ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రమాణం
బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేసి నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. పొరపాటున కూడా ఎవరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే, సీఎం అయ్యేది మాత్రం కేసీఆర్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.
గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి కెసిఆర్ 25 కోట్లు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్. ఇక ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో మండిపడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుండి తాము డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్ కార్యకర్తలు సమకూర్చిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఎన్నికలకు ఆర్ధిక సాయం చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాము కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. బిజెపి విశ్వసించే భాగ్యలక్ష్మి ఆలయం లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు తాను వచ్చి ప్రమాణం చేస్తానన్నారు.

ఏ ఆలయంలోనైనా తడిబట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఈటల రాజేందర్ వస్తారా? అంటూ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి భాగ్యలక్ష్మి గుడి వద్దకు రేవంత్ రెడ్డి చేరుకుంటారు. మరోవైపు ఈటల రాజేందర్ కూడా భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసరడంతో ఈరోజు సాయంత్రం ఏం జరగబోతుంది అన్నది రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications