దొడ్డు బియ్యం సన్నగా కావు: రేవంత్ రెడ్డికి ఈటెల కౌంటర్
హైదరాబాద్: హాస్టల్ విద్యార్తులకు దొడ్డు బియ్యమే పాలిష్ చేసి సరఫరా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణను తెలంగాణ పౌర సరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ ఖండించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో ఆహారం వడ్డిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో ఈటెల సోమావరం మీడియాతో మాట్లాడారు.
విద్యార్థులు తినే తిండిపై కూడా రాజకీయాలు చేయడం సరికాదని, దొడ్డు బియ్యం పాలిష్ చేస్తే సన్న బియ్యం కావని ఆయన స్పష్టం చేశారు. నంగనాచి మాటలు మాట్లాడే టీడీపీ నేతలు ఏనాడైనా హాస్టల్స్లో ఉన్నారా? బస చేశారా? తాము ఎమ్మెల్యేలుగా ఉండి ఉద్యమ సమయంలో హాస్టల్ విద్యార్థులతో సహజీవనం చేసిన చరిత్ర మాది అని ఆయన విరుచుకుపడ్డారు.
ఆ సమయంలో విద్యార్థులు ఎటువంటి తిండి తిన్నారో వారి కష్టాలెంటో తమకు తెలుసునని రాజేందర్ అన్నారు. ఆ క్రమంలోనే హాస్టళ్ల నిర్వహణను ఒకే గొడుగు కిందకు తెచ్చామని చెప్పారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, మానవతా కోణంలో ఆలోచించి హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం ఇస్తున్నమని అన్నారు. అంతే కానీ మరొకటి లేదని అన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ముక్కిపోయిన బియ్యం సరఫరా చేశారని, దొడ్డు బియ్యం బువ్వ తినలేక విద్యార్థులు అవస్థలు పడ్డారని అన్నారు. నోటి కాడి బువ్వ పందుల పాలు అయ్యేది లేదా చెత్తకుప్పల్లో ఉండేదని అన్నారు.
ఇప్పుడు హాస్టల్స్కి వెళ్లి చూడాలని అన్నారు. పిల్లలు కడుపు నిండా భోజనం చేస్తున్నారని, సంతోషంగా నిద్ర పోతున్నారని అన్నారు. సన్న బియ్యం సరఫరా కోసం రూ. 642 కోట్లు వెచ్చిస్తున్నామని, హాస్టల్స్ అంటే టిడిపి నేతలకు తెలియదని మంత్రి అన్నారు.
సంపాదనే ధ్యేయంగా, స్వార్థమే ఎజెండాగా బతికే తెలుగుదేశం పార్టీ నాయకులు హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంపై మాట్లాడే అర్హత లేదని అన్నారు. టీడీపీ నేతలు కుసంస్కారంతో నీచమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.