ఈటల రాజేందర్ సంచలనం -కేసీఆర్ సర్కారుపై హైకోర్టులో ఫైట్ -ఎన్నారైల మద్దతు -కరపత్రాల కలకలం
భూకబ్జా ఆరోపణలపై మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. కేసీఆర్ సర్కారుపై న్యాయపోరాటాన్ని ప్రారంభించారు. చావుకైనా సిద్ధమేగానీ ఆత్మగౌరవాన్ని వదులుకోలేనని, తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని సవాళ్లు విసిరిన ఈటల తన భవిష్యత్ కార్యాచరణపై ఓవైపు కీలక సంప్రదింపులు జరుపుతూనే, ప్రభుత్వంపై పోరును ఉధృతం చేశారు. వివరాల్లోకి వెళితే..

హైకోర్టుకు ఈటల కుటుంబం
భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. ఈటల సతీమణి జమున, కొడుకు నితిన్ రెడ్డి, జమునా హేచరీస్ కంపెనీలు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు సంబంధించిన ప్రైవేటు భూముల్లో ప్రభుత్వం వారు అక్రమంగా సర్వే చేసి బోర్డులు పెట్టారని పిటిషన్ లో ఆరోపించారు. తమ భూముల్లో ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని.. బలవంతపు చర్యలు తీసుకోకుండా డీజీపీ, విజిలెన్స్, మెదక్ కలెక్టర్ను ఆదేశించాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ విచారణపై హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు

బానిసత్వం దిశగా తెలంగాణ..
కేసీఆర్ సర్కారుపై న్యాయపోరాటం చేస్తూనే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో ఉన్న ఆయన మంగళవారం పలువురు ఎన్నారైలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈటలకు మద్దతుగా.. తెలంగాణ ఎన్ఆర్ఐ అమెరికా ఫోరం ఆధ్వర్యంలో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసమా? తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందని, ప్రలోభాలకు లొంగలేదు కాబట్టే తప్పుడు ఆరోపణలతో తనను బయటకు పంపారని ఈటల వ్యాఖ్యానించారు. తెలంగాణను మరోసారి బానిసత్వం వైపు కేసీఆర్ నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు.
Recommended Video

కలెక్టర్ శ్వేత.. కరపత్రాల కలకలం
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో భాగంగా మేడ్చల్ జిల్లా దేవరయాంజల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ భూములను జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి మంళవారం పరిశీలించారు. దేవాలయ భూముల ఆక్రమణల ఆరోపణలపై ఐఏఎస్లతో ప్రభుత్వం కమిటీ నియమించింది. దీంతో పాటు ఏసీబీ, విజిలెన్స్ దర్యాప్తునకూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ఆధీనంలో ఉన్న భూముల్లో గోదాంలను జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. ఇదిలా ఉంటే, హుజూరాబాద్ లోని మాజీ మంత్రి ఈటల క్యాంప్ కార్యాలయంలో కరపత్రాల కలకలం రేగింది. ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ప్రజా ఆరోగ్య పరిరక్షణ సంఘం పేరిట కరపత్రాలు వేసి వెళ్లారు. ఈటల రాజేందర్ అక్రమాస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని...ఐటి దాడులు చేయాలంటూ 19 డిమాండ్లతో తిప్పారపు సంపత్ పేరిట కరపత్రాలు ముద్రించారు.












Click it and Unblock the Notifications