ఎన్టీఆర్ బయోపిక్ లో అన్నీ అవాస్తవాలే..! విలన్లను హీరోలుగా చూపించబోతున్నారంటున్న నాదెండ్ల..!!
Recommended Video
హైదరాబాద్ : ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ వివాదాలు కూడా ముదురుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో ప్రముఖ రాజకీయ నాయకుల పాత్రలను ఎలా తీర్చి దిద్దుతున్నరనే అంశం పై ఉత్కంఠ నెలకొంది. ఎన్టీఆర్ నిజ జీవితంలో జరిగిన సంఘటనలను సినిమాలో యధావిధిగా చిత్రీకరించాలని కొందరు కోరుతుంటే పట్టుబడుతుంటే., అసలు యదార్థంగా ఎన్టీఆర్ కి ద్రోహం చేసిన వారిని హీరోలుగా చూపించే ప్రమాదం ఉందని మరికొంత మంది అంటున్నారు. ఐతే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఐన తొలినాళ్లలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన నాదెండ్ల భాస్కర రావు సినిమా నిర్మాణం, పాత్రల చిత్రీకరణ పట్ల అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న మలుపులను యధావిధిగా చిత్రీకరించకపోతే బయోపిక్ సినిమాకు అర్థం ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిజజీవిత సంఘటనలు యధావిదిగా చత్రీకరించాలి..! లేకపోతే చరిత్ర వక్రీకరణే అంటున్న నాదెండ్ల..!
తెలుగు సినీ పరిశ్రమలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్.టి.ఆర్'. దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్న విషయ తెలిసిందే. ఈ సినిమాలో ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్గా కనిపించబోతున్నారు. అంతేకాదు, ఆయనే స్వయంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్తో అనుబంధం ఉన్న ఎంతో మంది పాత్రలను చూపించబోతున్నారు. అందుకోసం ఇందులో ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.
విడుదలకు సమీపిస్తున్న సమయం..! ముదురుతున్న వివాదాలు..!!
ఎన్టీఆర్ భార్య బసవతారకమ్మ పాత్రలో విద్యాబాలన్, ఏపీ సీఎం చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా, ఏఎన్నార్ పాత్రలో సుమంత్, నందమూరి హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్, సావిత్రగా నిత్యా మీనన్, శ్రీదేవిగా రకుల్, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్ రాజ్పుత్ నటిస్తున్నారు. వీరితో పాటు కొందరు ప్రముఖుల పాత్రల్లో కైకాల సత్యనారాయణ, ప్రకాశ్రాజ్, వీకే నరేశ్, జిష్షు సేన్గుప్తా, మురళీశర్మ తదితరులు నటిస్తున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది.
విలన్లను విలన్లుగానే చూపించాలి..! తేడా చేస్తే మూల్యం తప్పదంటున్న భాస్కర్ రావు..!!
సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా వెన్నుపోటుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్టీఆర్కు ఒకానొక సందర్భంలో పక్షవాతం వచ్చింది. అప్పుడు ఆయన 12 మంది పిల్లలూ ఎన్టీఆర్ను పట్టించుకోలేదు. ఆ సమయంలోనే లక్ష్మీ పార్వతి ఎంటరయ్యింది. ఆయనకు సేవలు చేసి పెట్టింది. దీంతో ఎన్టీ రామారావు ఆమెను పెళ్లి చేసుకున్నారు. కష్టకాలం అండగా నిలిచిన లక్ష్మీ పార్వతి వెంట పెట్టుకుని తిరగడం ప్రారంభించారాయన. అప్పుడు కుటుంబ సభ్యులందరూ ఆమెను వ్యతిరేకించారు.
తన అనుమతి లేకుండా తన పాత్ర ఉండకూడదు..! మండిపడుతున్న నాదెండ్ల..!!
అంతేకాదు, ఆమెను సీఎంను చేస్తారన్న భయంతో ఎన్టీఆర్నే గద్దె దించాలని వాళ్లంతా ప్లాన్ చేశారు. దీనికి చంద్రబాబు నాయకత్వం వహించాడు. నేను ఎన్టీ రామారావును పెంచాను.. కుటుంబ సభ్యులు దించారు. వెన్నుపోటు పొడిచింది నేనా..? కుటుంబ సభ్యులా..? సినిమాలో తనను చెడుగా చూపించాలని వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నానని నాదెండ్ల అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు కోర్టులోనే ఉందని అందుకే చిత్ర యూనిట్ తన గురించి చెడుగా తీయరని. తీస్తే కోర్టు ఊరుకోదని ఆయన అంటున్నారు. అసలు తన అనుమతి లేకుండా తన పాత్ర ఉండకూడదని భాస్కర రావు అంటున్నారు. అంతే కాకుండా సినిమాలో నిజజీవిత సంఘటనలకు విరుద్దంగా పాత్రలను చిత్రీకరిస్తే చరిత్రను వక్రీకరించనట్టేనని ఆయన చెప్పుకొచ్చారు.