ఆటోలో ఈవీఎంలు!.. జగిత్యాలలో అర్ధరాత్రి కలకలం.. అదంతా ఫేక్ అంటున్న ఈసీ
Recommended Video
జగిత్యాల : ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యం వేరే చెప్పనక్కర్లేదు. ఎన్నికల ప్రచార వేళ ఒక్కో ఓటరును నేతలు ఏవిధంగా ప్రసన్నం చేసుకుంటారో.. వారి తిప్పలేంటో ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటిది ఓటర్లు తమ తీర్పును నిక్షిప్తం చేసిన ఈవీఎంలు.. స్ట్రాంగ్ రూముల్లో ఉండాల్సింది పోయి రోడ్లపై దర్శనమివ్వడం గమనార్హం. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి పూట 10 ఈవీఎంలు ఆటోలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. ఆ ఈవీఎంలు ట్రైనింగ్ కోసం తీసుకొచ్చినవంటూ స్పష్టం చేశారు.
వెల్లూరు లోక్సభ ఎన్నికలు రద్దా?.. కేంద్ర ఎన్నికల సంఘం ఏమంటోంది?
ఆటోలో ఈవీఎంలు
జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి కలకలం రేగింది. ఆటోలో ఈవీఎంల తరలింపు అనుమానాలకు తావిచ్చింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి మినీ స్టేడియంలో ఉన్న గోదాంకు వీటిని తరలిస్తున్నట్లు సమాచారం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఈవీఎంలు ఆటోలో ప్రత్యక్షం కావడం దుమారం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
అర్ధరాత్రి ఎందుకో..!
అర్ధరాత్రి వేళ ఈవీఎంలు ఆటోలో ప్రత్యక్షం కావడం హాట్ టాపికయింది. అదలావుంటే తహసీల్దార్ కార్యాలయం నుంచి మినీ స్టేడియంలోని గోదాంకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ గోదాంకు తాళాలు వేసి ఉండటంతో వాటిని తిరిగి తహసీల్దార్ కార్యాలయానికి పంపించినట్లు సమాచారం. ఈవీఎంల తరలింపునకు అధికారికంగా ఆమోద ముద్ర ఉంటే.. డే సమయంలో తరలించాలి గానీ ఇలా అర్ధరాత్రి పూట తరలించడమేంటనే ఆరోపణలు వినిపించాయి.
వీడియో వైరల్
రెండు రోజుల కిందట కూడా కారులో అదే గోదాంకు కొన్ని ఈవీఎంలు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆటోలో ఈవీఎంలు ప్రత్యక్షమయ్యాయి. స్ట్రాంగ్ రూముల్లో ఉండాల్సిన ఈవీఎంలు ఇలా రోడ్లపైకి రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆటోలో ఈవీఎంల తరలింపుపై అధికారుల వెర్షన్ మరోలా ఉంది. ఓటర్ల అవగాహన కోసం తెప్పించిన ఈవీఎంలంటూ సమాధానమిస్తున్నారట. మొత్తానికి జగిత్యాలలో జరిగిన రెండు ఘటనలపై కలెక్టర్ శరత్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
అవి ట్రైనింగ్ ఈవీఎంలు.. ఈసీ వివరణ
జగిత్యాలలో అర్ధరాత్రి కలకలం సృష్టించిన ఈవీఎంల ఘటనపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. అదంతా ఫేక్ అంటూ కొట్టిపారేశారు. ఆటోలో తరలిస్తున్న ఈవీఎంలు.. ట్రైనింగ్ కోసం తీసుకొచ్చినవంటూ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు వేలాదిమంది కష్టపడి సక్సెస్ చేస్తే ఇలాంటి ఫేక్ న్యూస్ ఇబ్బందికరంగా మారాయని అన్నారు. ఇటీవల వాట్సాప్ లో ఈవీఎంలు పట్టుబడ్డాయంటూ చక్కర్లు కొట్టిన వీడియో.. 2018 రాజస్థాన్ లో జరిగిన ఎన్నికలకు సంబంధించిందని తెలిపారు. ఫేక్ న్యూస్ సర్య్కులేట్ చేస్తే పోలీస్ కేసులు నమోదుచేస్తామన్నారు.