మహిళతో ఫోన్లో అసభ్యంగా మాట్లాడి దొరికిపోయారు: రాజయ్యపై సొంత పార్టీ ఆగ్రహం
వరంగల్: తెరాస నేత టీ రాజయ్యకు స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడంపై ఆయనపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో పాటు మహిళలను కించపరిచేలా మాట్లాడే ఆయనకు టిక్కెట్ వద్దని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు రత్నాకర్ రెడ్డి, స్వామి నాయక్ల ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.
పవన్ సీక్రెట్ మీటింగా? ఇదిగో ఆధారం!: 'వారి అజ్ఞానానికి చింతిస్తున్నాం'
అవినీతి, అక్రమాలకు పాల్పడిన రాజయ్యను తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఓ మహిళతో రాజయ్య అసభ్య ఫోన్ సంభాషణలు చేసిన కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, అలాంటి వ్యక్తికి టిక్కెట్ ఇస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందన్నారు. రాజయ్య స్థానంలో మరో అభ్యర్థికి టిక్కెట్ కేటాయించాలన్నారు. ఆయనకే టిక్కెట్ ఇస్తే ఓడిపోతామన్నారు.
మహిళలతో అసభ్య ప్రవర్తనతో పదవి పోగొట్టుకున్నారు
మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే రాజయ్యను పార్టీ నుంచే బర్తరఫ్ చేయాలని మరికొందరు నేతలు డిమాండ్ చేశారు. గతంలో రాజయ్య అసభ్య ప్రవర్తనతో ఉప ముఖ్యమంత్రి పదవి కోల్పోయారని, అయినా తన ధోరణిని మార్చుకోలేదన్నారు. అలాంటి నేతకు టిక్కెట్ ఇవ్వడం సరికాదన్నారు.
మహిళతో అసభ్యంగా మాట్లాడి మీడియాకు దొరికారు
ప్రస్తుతం ఓ మహిళతో రాజయ్య సెల్ఫోన్లో అసభ్యంగా మాట్లాడి మీడియాకు దొరికిపోయారని, ఇలాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే తాము ఎలా ప్రచారం చేయాలని మరికొందరు నేతలు ప్రశ్నించారు. ఆయన ఏనాడు కార్యకర్తలను, నాయకులను నమ్ముకోలేదని, ఆదుకోలేదని, కమీషన్ల కోసమే అభివృద్ధి పనులు చేయించుకున్నారని చెప్పారు.
స్థాయి మరిచి అలా మాట్లాడుతారా?
సాక్షాత్తు ఓ శాసన సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రజల్లో చులకన భావం ఏర్పడేలా మాట్లాడితే ఎలా అన్నారు. ఆయన తన స్థాయిని మరిచారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆయనను పార్టీ నుంచి బర్తరఫ్ చేసి, అభ్యర్థిని మార్చాలన్నారు. లేదంటే ప్రజల నుంచి తీవ్రత వస్తుందన్నారు. కాగా, రాజయ్య ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆరోపణలు కొట్టిపారేసిన రాజయ్య
కాగా, ఈ ఆరోపణలను రాజయ్య కొట్టి పారేశారు. తాను ఏ మహిళతోను అసభ్యంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. మహిళలు అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పారు. తాను అంటే గిట్టని వారు ఇలాంటి నీచమైన ప్రచారానికి పాల్పడుతున్నారన్నారు.