అదే లక్ష్యం.. బహుజన వర్గాల కోసం ఉరికంభానికైనా సిద్ధం-ఇక ఆ డ్రామాలు బంద్-తేల్చేసిన మాజీ ఐపీఎస్ ప్రవీణ్
బహుజనుల బతుకులు మారాలంటే వంద శాతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం ఉందని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలోనే కాదు దేశంలో దోపిడీ,పీడన,బానిసత్వం నుంచి ఆ వర్గాలను విముక్తి చేసేందుకు బహుజన సిద్దాంతంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.బహుజన ప్రయోజనాలే కేంద్ర బిందువుగా పనిచేసే వైపు తాను నిలబడుతానని స్పష్టం చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ తన ఆలోచనలను పంచుకున్నారు. తనపై చేస్తున్న ఆరోపణలు,విమర్శలకు ధీటైన జవాబిచ్చారు.
IPS RS Praveen Kumar :అనూహ్య నిర్ణయం-పదవికి రాజీనామా-తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం..?
అది సమయం నిర్ణయిస్తుంది : ఆర్ఎస్ ప్రవీణ్
సర్వీసులో ఉండి పేదల కోసం తాను చేసింది కేవలం ఒక్క శాతమేనని... మిగతా 99 శాతం కోసమే తాను పదవీ విరమణ చేశానని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.ఆ కుర్చీకి పరిమితులు ఉన్నాయని... దాన్ని అధిగమించి పేదల కోసం మరింతగా పనిచేసేందుకే పదవి నుంచి బయటకొచ్చానని చెప్పారు.' 75 ఏళ్ల స్వాతంత్య్రంలో ఇంకా పేదరికం వెంటాడుతోంది. సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారు. సంపదంతా ఒక శాతం,రెండు శాతం ఉన్న వారి చేతుల్లో పోగుబడింది. మిగతావారు కేవలం తాయిలాలు తీసుకునే జీవులుగా మిగిలిపోతున్నారు. వారిని కేవలం ఫించన్లు తీసుకునేవారిగా,సబ్సిడీలు తీసుకునేవారిగా చూస్తే వారి జీవితాలు మారవు.' అని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఇక ముందు కూడా తాను జనంతో,జనంలోనే ఉంటానని వెల్లడించారు. రాజకీయ ఆరంగేట్రం ఎప్పుడనేది సమయం నిర్ణయిస్తుందన్నారు.
IPS RS Praveen Kumar : హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీపై ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్షన్ ఇదే...
అదంతా కుట్ర.. ఇక డ్రామాలు బంద్ : ఆర్ఎస్ ప్రవీణ్
తనను పదేపదే దళిత ఐపీఎస్ అధికారి అని పేర్కొనడంలో కుట్రలు దాగున్నాయని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తనను ఒక వర్గానికే పరిమితం చేసే కుట్ర మొదటి నుంచి జరుగుతూనే ఉందన్నారు. ఆ కుట్రలు ప్రజలు తెలుసుకుంటున్నారని చెప్పారు. 2 వేల ఏళ్లుగా ఈ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలమ సామాజికవర్గానికో,రెడ్డి సామాజికవర్గానికో,కమ్మ సామాజిక వర్గానికో చెందిన అధికారులను ఆ ట్యాగ్ లైన్తో ఎందుకు పిలవరు... కేవలం దళిత,గిరిజన అధికారులనే ఎందుకలా పిలుస్తారని ప్రశ్నించారు. 'ఇదంతా వారిని అక్కడికే పరిమితం చేసే కుట్ర... ఆరోజులు పోయాయి... ఇక ఆ డ్రామాలు బంద్...' అని ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
బహుజనులకు రాజ్యాధికారం రావాల్సిందే : ఆర్ఎస్ ప్రవీణ్
హైటెక్ సిటీలో ఉన్న కంపెనీల్లో ఎన్ని కంపెనీలు దళితులు,బీసీల చేతుల్లో ఉన్నాయని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. టాలీవుడ్లో బహుజనల స్థానమేంటని ప్రశ్నించారు. ఈ స్థితి గతులు మారాలంటే వంద శాతం బహుజనులకు రాజ్యాధికారం రావాల్సిందేనని అన్నారు. తాను ప్రజా జీవితంలోకి వస్తానని... అయితే ఏ వేదిక అన్నది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. బీఎస్పీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన దాటవేశారు. స్వేరో సంస్థను రాజకీయ లక్ష్యం కోసమే స్థాపించారన్న ప్రచారం కూడా కుట్రనే అన్నారు. గురుకులాల నంచి వందల్లో డాక్టర్లు,ఇంజనీర్లు తయారవుతున్న నేపథ్యంలో... ఇలాగైతే ఇక మన ఇళ్లల్లో,గ్రామాల్లో కూలీ పనులు చేసేదెవరన్న భావనతో కొంతమంది స్వేరో సంస్థ మీద ఆరోపణలు,అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఉరికంభం ఎక్కేందుకైనా సిద్ధం : ఆర్ఎస్ ప్రవీణ్
గురుకులాల కార్యదర్శిగా తాను అక్రమాలకు పాల్పడినట్లు,ఆస్తులు కూడగట్టుకున్నట్లు చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తాను ఉరికంభం ఎక్కడానికైనా సిద్ధమని చెప్పారు. తన వర్గాలకు న్యాయం జరుగుతుందనుకుంటే ఉరికంభం ఎక్కేందుకు కూడా సిద్ధపడే వ్యక్తినని... తనది మడమ తిప్పని నైజమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బహుజనులకు న్యాయం జరగలేదని పరోక్షంగా పేర్కొన్నారు. జరిగే అవకాశం కూడా కనిపించట్లేదన్నారు.అందుకే తాను బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. భవిష్యత్తులో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా తన కార్యాచరణ ఉంటుందని ప్రవీణ్ కుమార్ చెప్పకనే చెప్పారు. అయితే కొత్త పార్టీ పెడుతారా... లేక బీఎస్పీలో చేరుతారా అన్న విషయాన్ని ఇంకా సస్పెన్స్లోనే పెట్టారు.