మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్పై కాల్పులు, ఎన్నో అనుమానాలు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి ముఖేష్గౌడ్ కుమారుడిపై శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఫిలింనగర్ ప్రాంతంలో రోడ్ నంబర్ 86లో ముఖేష్గౌడ్ నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి ముఖేష్గౌడ్ కుమారుడిపై శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఫిలింనగర్ ప్రాంతంలో రోడ్ నంబర్ 86లో ముఖేష్గౌడ్ నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
తీవ్రంగా గాయపడిన విక్రమ్గౌడ్ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగా ఉందని.. ప్రాణాపాయం లేదని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపింది ఎవరనేది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన విక్రమ్ గౌడ్.. తెల్లవారుజామున 3.30గంటలకు పూజ కోసం సిద్ధమై హాలులో కూర్చున్నారు. ఆ సమయంలో వచ్చిన ఎవరితోనో గొడవ పెట్టుకున్నట్లు తెలిసింది. వారే విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిపి పరారయ్యారు.
దీంతో రెండు బుల్లెట్లు విక్రమ్ శరీరంలోకి దూసుకెళ్లాయి. ఒకటి చేతిలోకి, మరోటి కడుపుకి దిగాయి. కాల్పుల శబ్ధం విని భార్య వచ్చి చూసేసరికి విక్రమ్ గౌడ్ రక్తపు మడుగులో పడివున్నారు. ఆమె వెంటనె అతడ్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు.. విక్రమ్ గౌడ్ ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డారని తెలిపారు. ఒక బుల్లెట్ బయటికి తీసిన వైద్యులు, మరో బుల్లెట్ తీసేందుకు రెండ్రోజుల సమయం పడుతుందని చెప్పారు.
కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లో భార్య మాత్రమే ఉంది. సెక్యూరిటీ గార్డు అవుట్ హౌజ్లో ఉన్నట్లు తెలిసింది. కాగా, విక్రమ్ గౌడ్ పలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. అయితే, అతనిపై కాల్పులు జరపాల్సిన అవసరం ఎవరికుంటుందనేది సందేహంగా మారింది. ఎవరైనా కాల్పులు జరిపారా? లేక అతనే తనకు తాను కాల్చుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.
కాగా, ప్రతీరోజూ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి ఉదయం వెళుతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా, ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విక్రమ్ నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆయన నోరు విప్పితేనే నిజాలు బయటికి వస్తాయని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆయుధాలు స్వాధీనం చేసుకోలేదని చెప్పారు.
భార్య ఫిర్యాదు
కాల్పుల ఘటనపై విక్రమ్ గౌడ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను తన పిల్లలతో పై అంతస్తులో ఉన్నానని.. కాల్పుల శబ్ధం విని కిందికి వచ్చేసరికి విక్రమ్ రక్తపు మడుగులో ఉన్నారని తెలిపింది. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. తనకు ఎవరిపైనా అనుమానం లేదని, ఎవరో దుండగులు కాల్పులు జరిపి ఉంటారని ఆమె చెప్పారు. పూజ కోసం గుడికెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. గత కొంతకాలంగా తమ అత్తామామలతో తాము వేరుగా ఉంటున్నామని చెప్పారు.