పొంగులేటికి ఊహించని షాక్!
మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాదాపుగా భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కమలదళంలో చేరడమే తరువాయి అన్నట్లుగా పరిస్థితి ఉంది. పార్టీలో చేరిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా భారీగా బహిరంగసభ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
అయితే మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎదురైన అనుభవమే తాజాగా పొంగులేటికి ఎదురవుతోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన అనుచరులందరినీ కోమటిరెడ్డి బీజేపీలో చేర్పించారు. అయినప్పటికీ ఆయన ఓటమిపాలయ్యారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న కొందరు ముఖ్యమైన అనుచరులు బీజేపీలో చేరడానికి నిరాకరించారు. పార్టీలో చేరకపోయినప్పటికీ తనకు మద్దతివ్వమని కోమటిరెడ్డి కోరితే సరే అన్నారుకానీ పరాజయాన్ని అడ్డుకోలేకపోయారు.

సరిగ్గా అటువంటి పరిస్థితే పొంగులేటికి ఎదురవుతోంది. మధిర, పినపాక, భద్రాచలం, సత్తుపల్లి, ఇల్లెందు, వైరా, పాలేరు ప్రాంతాల్లో పొంగులేటికి అనుచర గణం ఉంది. వీరందరు కూడా బీజేపీలో చేరతారని భావిస్తున్నారు. అయితే పొంగులేటి బీజేపీ అనేసరికి వీరంతా వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కాకుండా, కాంగ్రెస్ కాకుండా బీజేపీ అనేసరికి వీరంతా పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. వారిని పొంగులేటి ఏవిధంగా బుజ్జగించి వారికి కాషాయ కండువా కప్పుతారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications