రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: జానా రెడ్డి నినాదం
హైదరాబాద్/ నల్లగొండ: రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత జానారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రాగాపూర్, దొండపల్లిలో ఆత్మహత్య చేసుకున్న, రైతు కుటుంబాలను కాంగ్రెస్ నేతలు సబితా, ప్రతాప్కుమార్, ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరామర్శించారు.
రైతు ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలే ఆయన ఈ సందర్బంగా అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ పూర్తిగా విఫలమయిందని ఆయన విమర్శించారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని జానారెడ్డి తెలిపారు.
రైతుల ఆత్మహత్యలు బాధాకరమని, ఒకే దఫాలో రుణమాఫీ చేసింటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు.
జూన్ 2 నుంచి చనిపోయిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కరువు మండలాలను వెంటనే ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు.