స్కూల్ నుంచి లేట్గా వచ్చాడని కుమారుడుపై తండ్రి దాడి.. కట్ చేస్తే !
క్షణికావేశంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే మనుషులు మృగాళ్ల లాగా మారిపోతున్నారని అనిపిస్తుంటుంది. ఆవేశంలో జరిగే ఘటనలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. మద్యం మత్తులో ఓ తండ్రి క్షణికావేశంలో చేసిన దారుణానికి ఇప్పుడు ఆ కుటుంబం బోరున విలపిస్తుంది. పాఠశాల నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చాడని ఓ తండ్రి మద్యం మత్తులో విచక్షణరహితంగా తీవ్రంగా కొట్టడంతో... ఆ బాలుడు మృతి చెందాడు. ఈ దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో చోటు చేసుకుంది.
ఆరేగూడేనికి చెందిన కట్ట సైదులు, నాగమణి.. ప్రస్తుతం చౌటుప్పల్లో నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు. మూడో కుమారుడు భానుప్రసాద్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. భానుప్రసాద్ చదివే పాఠశాలలో ఫేర్ వెల్ ఫంక్షన్ నిర్వహించారు. దీంతో అతను రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఇంటికి తిరిగివచ్చాడు. లారీ డ్రైవర్ గా పని చేస్తున్న సైదులు అప్పటికే మద్యం తాగి ఇంటికి వచ్చాడు.

అయితే అసలు విషయం తెలుసుకోకుండానే బాలుడిని విచక్షణారహితంగా కొట్టాడు. ఛాతీ, ఇతర భాగాలపై పిడిగుద్దులు గుద్దడం, కాలితో తన్నడంతో భానుప్రసాద్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం వద్దని వైద్యులకు చెప్పి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. రాత్రికి రాత్రే బాలుడి మృతదేహాన్ని ఆరెగూడెంకు తరలించారు. పోలీసులకు తెలిస్తే సైదులుపై కేసు నమోదు చేసి జైలుకు పంపుతారని భావించి మృతదేహాన్ని దహనం చేసేందుకు హడావుడిగా ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం పది గంటలకు శ్మశానవాటికకు తరలించారు. అయితే పోలీసులకు సమాచారం అందడంతో స్మశాన వాటికకు చేరుకొని అంత్యక్రియలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి నాగమణి నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. సైదులును పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications