పెళ్లి చేయాల్సి వస్తుందని దారుణం: రెండో భార్యతో కలిసి కూతుర్ని చంపిన తండ్రి
కరీంనగర్: గొల్లపల్లి మండలంలోని వెన్గుమట్ల గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేయాల్సి వస్తుందనే నెపంతో కన్న తండ్రే రెండో భార్యతో కలిసి కూతుర్ను హత్య చేశాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. వెన్గుమట్లకు చెందిన పాటుకూరి సత్యనారాయణరెడ్డి, మద్దులపల్లికి చెందిన ప్రేమలతను వివాహం చేసుకున్నాడు.
కూతురు పుట్టిన తర్వాత మనస్పర్దలు ఏర్పడి ఇద్దరు పన్నెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రేమలత తన కూతురు మౌనశ్రీ(22)ని చదివించుకుంటూ కరీంనగర్లో నివాసం ఉంటోంది.
కాగా, సత్యనారాయణరెడ్డి రెండో భార్య వద్ద ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మొదటి భార్య కూతురు మౌనశ్రీ అప్పుడప్పుడు వెన్గుమట్లకు వస్తూపోతుండేది. వెటర్నరీలో డిప్లొమా చేసిన మౌనశ్రీకి పెళ్లిచేయాలని సత్యనారాయణరెడ్డికి ప్రేమలత తెలిపింది.
ఈ క్రమంలో అబ్బాయిని చూడటానికి రమ్మని మౌనశ్రీకి చెప్పగా, మంగళవారం వెన్గుమట్లకు వెళ్లింది. కాగా, పెళ్లి చేస్తే కట్నం ఇవ్వాల్సి వస్తుందనే నెపంతో అనుమానం రాకుండా మౌనశ్రీని చంపాలని నిర్ణయించుకున్నాడు. టీలో మత్తుమందు కలిపి ఇచ్చి.. రాత్రి మౌనశ్రీని ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.
సమాచారమందుకున్న పోలీసులు, తమదైన శౌలిలో విచారణ చేశారు. దీంతో మౌనశ్రీ ముఖంపై దిండు పెట్టి చంపినట్లు సత్యనారాయణరెడ్డి ఒప్పుకున్నాడు. పోలీసులు మౌనశ్రీ ఫోన్ను పరిశీలించగా, ఆమె తల్లికి పంపిన మెసేజ్లో పిన్ని చాయ్ పొసింది, తల తిప్పుతోంది అన్న సమాచారం ఉన్నట్లు తెలిసింది.
మౌనశ్రీ మృతికి కారణమైన తండ్రి సత్యనారాయణరెడ్డితో పాటు సవతి తల్లి లత, సత్యనారాయణరెడ్డి బావమరిది రాజుపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ రమేశ్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని సీఐ వెంకటరమణ పరిశీలించారు. మృతురాలి తల్లి ప్రేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.