యాదాద్రిలో ప్రారంభమైన ఉత్సవాలు.. ఇకనుంచి వారికి ఫ్రీ దర్శనం..
తెలంగాణలో ప్రముఖ్య ఫుణ్యక్షేత్రంగా పేరుగాంచింది యాదాద్రి శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆలయం. ఈ ఆలయంలో ఈ నెల 20వ తేదినుంచి స్వామివారి జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే, యాదాద్రి గుట్టపైకి వెళ్లేవారికి ఆలయ అధికారులు ఓ శుభవార్తను అందించారు. ఇకనుంచి ఆలయ దర్శనానికి విచ్చేసే దివ్యాంగులు, వృద్ధులకు నేరుగా, ఉచితంగా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకునే అవకాశాన్ని ఆలయ అధికారులు కల్పించారు. ఈ మేరకు ఆలయ ఈవో భాస్కర్ రావు సంబంధిత విభాగానికి ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
యాదాద్రి ఆలయంలో ప్రతిరోజూ ఉదయం 7:30 నుంచి 8:30 గంటల వరకు, 10 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, రాత్రి 8:30 నుంచి 9 గంటల మధ్య తూర్పు గోపురం నుంచి భక్తులను నేరుగా ఆలయంలోకి అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నరసింహాస్వామి ఆలయంలో స్వామివారి వార్షిక జయంతి మహోత్సవాలు సోమవారం (మే 20) ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వస్తివాచనం, సాయంత్రం అంకురార్పణ పర్వాలతో ఉత్సవాలకు వేదపండితులు, యాజ్ఞికులు శ్రీకారం చుట్టారు. ఇక, ఈ వేడుకల్లో యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి తిరుమల స్వామివారైన శ్రీవెంకటేశ్వరస్వామి రూపంలో ఉదయం గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వగా, రాత్రివేళ పరవాసుదేవుడిగా కనిపించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ మహాముఖ మండపంలో లక్ష కుంకుమార్చన కైంకర్యాన్ని వేద, మంత్ర పఠనాల మధ్య శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామివారి జయంతి వేడుకల్ని యాదాద్రి ఆలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్టలో నిర్వహించారు.












Click it and Unblock the Notifications