టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు తరువాత ఒత్తిడి పెరిగింది: సజ్జనార్
TSRTC: సంగారెడ్డి జిల్లాలోని అందోల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు డ్రైవర్పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఉదంతం పట్ల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్పందించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు, సిబ్బందిపై దాడులకు పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిపారు.
అందోల్లో టీఎస్ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియోను సజ్జనార్.. తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కొందరు వ్యక్తులు డ్రైవర్ను కిందికి లాగి చెప్పుతో కొట్టడం ఈ వీడియోలో కనిపించింది. ప్రయాణికులు వారిస్తున్నప్పటికీ.. వాళ్లు డ్రైవర్పై దాడికి దిగారు. విచక్షణారహితంగా కొట్టారు.

ఈ ఘటనపై సజ్జనార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిబద్దతతో విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదని, ఇలాంటి ఘటనలు ఉద్యోగుల్లో ఆందోళనలను కలిగిస్తోన్నాయని అన్నారు. ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా తన బైక్ను నడపి ప్రమాదానికి కారణమయ్యాడని, అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి బస్సు డ్రైవర్పై దాడి చేశాడని, దుర్బాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టారని అన్నారు.
ఇలాంటి దాడులను యాజమాన్యం సహించబోదని సజ్జనార్ తేల్చి చెప్పారు. ఈ ఘటనపై అందోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అన్నారు. తమ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దర్యాప్తు మొదలుపెట్టారని చెప్పారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు.
బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందని సజ్జనార్ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ.. ఎంతో సహనంతో ఉద్యోగులు, సిబ్బంది విధులను నిర్వర్తిస్తోన్నారని, అలాంటి వారిపై దాడులు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.












Click it and Unblock the Notifications