చెల్పూరు కేటీపీపీలో పేలుడు: ఏడుగురు కార్మికులకు గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమం
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్(కేటీపీపీ)లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి చెల్పూరు కేటీపీపీ ఒకటో యూనిట్లో 500 మెగావాట్ల పవర్ ప్లాంట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు.
క్షతగాత్రులను భూపాపల్లి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. కాగా, కోల్ పంపించే మిల్లులో ఉన్నట్టుండి మిల్లర్ పేలింది. ఈ పేలుడు కారణంగా ప్లాంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఓవైపు మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టిన అధికారులు.. మరోపక్క గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిలో ఒకరు ఆర్టిజన్ (బెల్ట్ మీద బొగ్గు సేకరించే పని), ఒకరు జేపీఏ ఉన్నారు. మరో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఒకటో యూనిట్ లో ఈ ప్రమాదం జరిగింది. 6 మిల్లర్లు క్రషర్ అవుతాయని, అయితే, ఒక్కసారిగా ఎయిర్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. విచారణ అనంతరం ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు.