ఉగ్రవాదులంటూ కాల్పులు: తెలుగు ఇంజినీర్ మృతి, మరో వ్యక్తికి తీవ్రగాయాలు
అమెరికాలో జాత్యాహంకారంతో ఓ తెల్లజాతి దుండగుడు ఇద్దరు తెలుగు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఇందులో ఒకరు మరణించారు.
కన్సాస్: అమెరికా జాత్యాహంకారంతో ఉగ్రవాదులని సంభోదిస్తూ.. ఓ తెల్లజాతి దుండగుడు ఇద్దరు తెలుగు వ్యక్తులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల ఘటనలో ఓ తెలుగు ఇంజినీర్ మరణించారు. మృతుడిని శ్రీనివాస్ కూచిబొట్ల(హైదరాబాద్ వాసి)గా గుర్తించారు. మరో తెలుగు వ్యక్తి అలోక్ మాదసాని(వరంగల్ వాసి) తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కన్సాస్ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. వీరిద్దరూ గార్నిమ్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అలోక్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జేఎన్టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
కాగా, అలోక్ హైదరాబాద్లోని వాసవి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసి కన్సాస్లోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరిలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఈ కాల్పుల్లో ఇయాన్ గ్రిల్లట్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డారు.
'మా దేశం నుంచి వెళ్లిపోండి..' 'ఉగ్రవాదుల్లారా.. ' అంటూ జాత్యహంకార వ్యాఖ్యలతో దుండగుడు దూషించాడు. దీంతో బార్ యాజమాన్యం కలుగజేసుకొని అతడిని బయటకు పంపింది. కాసేపటికే అతడు తిరిగి వచ్చి తుపాకీతో వీరిపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు.
ఘటనకు సంబంధించి ఆడమ్ పూరింటన్ అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 15 రోజుల్లో అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తెలుగు వారు మృతి చెందారు. ఫిబ్రవరి 12న కాలిఫోర్నియాలో వరంగల్కు చెందిన వంశీరెడ్డి ఓ యువతిని కాపాడబోయే ప్రయత్నంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే.
భార్య కూడా అక్కడే.. శ్రీనివాస్ సౌమ్యుడంటూ స్నేహితులు
కాగా, శ్రీనివాస్ కూచిబొట్ల భార్య సునయనా దుమాల కూడా అదే ప్రాంతంలోని టెక్నాలజీ కంపెనీలో పని చేస్తున్నారు. శ్రీనివాస్ ఎంతో సౌమ్యుడని, అందరితో స్నేహంగా ఉండేవాడని అతని స్నేహితులు చెప్పారు. ఇది ఇలా ఉండగా, శ్రీనివాస్ కుటుంబానికి సాయం అందించేందుకు అమెరికాలోని భారత ఎంబసీ ఇద్దరు అధికారులను కన్సాల్కు పంపింది.
I am shocked at the shooting incident in Kansas in which Srinivas Kuchibhotla has been killed. My heartfelt condolences to bereaved family.
— Sushma Swaraj (@SushmaSwaraj) February 24, 2017
సుష్మా స్వరాజ్ దిగ్భ్రాంతి
అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ మృతి చెందడం పట్ల భారత విదేశీ వ్యవహారల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేావారు. ఆయన కుటుంబసభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శ్రీనివాస్ కుటుంబసభ్యులతో సుష్మా స్వరాజ్ మాట్లాడారు. మృతదేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
అండగా ఉంటాం: శ్రీవానస్ పని చేస్తున్న కంపెనీ
శ్రీనవాస్ పని చేస్తున్న అమెరికన్ కంపెనీ గార్మిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. శ్రీనివాస్ మృత దేహాన్ని భారత్ కు పంపించేందుకు అవసరమైన అన్ని సహాయాలు చేస్తామని తెలిపింది. శ్రీనివాస్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కంపెనీ హెఆర్ వైస్ ప్రెసిడెంట్ లారీ మైనార్డ్ చెప్పారు.