తొలి రోజు మెట్రో జర్నీ: హైదరాబాదీలంతా 'ఫుల్ ఖుష్', స్మార్ట్ కార్డు తిరిగిచ్చే ఛాన్స్!
ప్రతీ మెట్రో స్టేషన్ లోను స్మార్ట్ కార్డు కౌంటర్ అందుబాటులో ఉంటుంది. రూ.200చెల్లించి ఎవరైనా ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు.
Recommended Video
హైదరాబాద్: రాజధాని ప్రజల కలల మెట్రో ఎట్టకేలకు పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. సామాన్యులంతా ఎప్పుడెప్పుడు అందులో ప్రయాణిద్దామా? అని వేచి చూస్తున్న టైమ్ కూడా రానే వచ్చింది.
బుధవారం నుంచి మెట్రో సేవలు సామాన్యులకు అందుబాటులోకి రావడంతో తెల్లవారుజాము నుంచే ఆయా స్టేషన్ల వద్ద రద్దీ కనిపించింది. తొలిసారిగా మెట్రో రైల్లో ప్రయాణం కోసం నగర ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తుండటంతో మొదటి రోజు రద్దీ ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.
5గం. నుంచే స్మార్ట్ కార్డ్ కౌంటర్స్:
ప్రతీరోజు ఉదయం 6గం. నుంచి రాత్రి 10గం. వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. క్రమ క్రమంగా మెట్రో రైలు వేళలను పెంచనున్నారు.
బుధవారం నుంచి మెట్రో రైల్లో ప్రయాణం అందుబాటులోకి రావడంతో.. చాలామంది ప్రయాణికులు ఉదయం 5గం.కే మెట్రో స్టేషన్లకు చేరుకున్నారు. ప్రయాణికులు ముందే వస్తారన్న విషయాన్ని గుర్తెరిగి ఉదయం 5గం. నుంచే అధికారులు స్మార్ట్ కార్డ్ కౌంటర్స్ ఓపెన్ చేశారు.
పావుగంటకో రైలు:
మెట్రో స్మార్ట్ కార్డుల విక్రయం ప్రారంభించిన మూడు రోజుల్లోనే 12వేల కార్డులు అమ్ముడవడం విశేషం. ఇకపోతే మెట్రో స్టేషన్లలో ప్రతీ పావుగంటకో రైలు చొప్పున 18రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్లాట్ ఫామ్ పైకి వచ్చిన వ్యక్తి అరగంట సమయం లోగానే రైల్లో ఎక్కాల్సి ఉంటుంది. రెండు గంటలకు మించి స్టేషన్ లో ఉండటానికి అనుమతించరు. తొలి రోజు సుమారు లక్ష మంది ప్రయాణించవచ్చునని అంచనా వేస్తున్నారు.
మియాపూర్-నాగోల్.. 27.6 కి.మీ:
నిజానికి మియాపూర్-నాగోలు మధ్య దూరం 30కి.మీ. అయితే చివరి స్టేషన్ నుంచి డిపో వరకు ఉన్న దూరాన్ని మినహాయిస్తే.. 27.6కి.మీగా తేలింది.ఎల్&టీ సంస్థ తమ వెబ్ సైట్ ద్వారా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.
వెనక్కి ఇచ్చేస్తే రూ.80:
తొలిరోజు మెట్రోలో ప్రయాణిస్తున్నవారి ఆనందం కళ్లల్లోనే కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మెట్రోలో ప్రయాణం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ప్రతీ మెట్రో స్టేషన్ లోను స్మార్ట్ కార్డు కౌంటర్ అందుబాటులో ఉంటుంది. రూ.200చెల్లించి ఎవరైనా ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు. ఇందులో రూ.100తో రీఛార్జీ చేస్తారు. ఆ తర్వాత మెట్రోలో ప్రయాణించవచ్చు. కార్డును ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ ఈ కార్డును కౌంటర్ లోనే తిరిగి వెనక్కి ఇచ్చేస్తే రూ.80 తిరిగి ఇస్తారు.