హైదరాబాదీ డాక్టర్ల నయా రికార్డ్: వైద్య రంగలో నూతన అధ్యాయం: మొదటిసారి: చండీగఢ్ పేషెంట్కు
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన డాక్టర్లు మరో ఘనతను సాధించారు. వైద్య చరిత్రలో ఓ అరుదైన ఘట్టానికి తెర తీశారు. దేశంలోనే మొదటిసారిగా ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు. దేశ వైద్య రంగంలో ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అదే- డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్. ఊపిరితిత్తుల మీర్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు. డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది దేశంలో మొదటిసారి కావడం డాక్టర్ల ఘనతకు అద్దం పడుతోంది. హైదరాబాద్.. మెడికల్ హబ్గా ఆవిర్భవించిందనడానికి సాక్ష్యంగా నిలిచింది.
హర్యానాలోని చండీగఢ్కు చెందిన రిజ్వాన్ అనే పేషెంట్కు కిమ్స్ డాక్టర్లు ఈ డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. 32 సంవత్సరాల రిజ్వాన్.. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు. అనంతరం ఆయన పల్మనరీ సర్కోయిడోసిస్ అనే అరుదైన జబ్బుకు గురయ్యారు. ఈ జబ్బు బారిన పడిన వారికి ఊపిరితిత్తులను మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఈ జబ్బు బారిన పడిన వారి శరీరంలో మిగిలిన అవయవాలు దెబ్బతింటాయి. ఏ అవయవం దాని బారిన పడితే.. దాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది.
రిజ్వాన్కు కూడా ఈ పల్మనరీ సర్కోయిడోసిస్ వల్ల ఊపిరితిత్తులుదెబ్బతిన్నాయి. దీంతో అనారోగ్య సమస్య తీవ్రంగా మారింది. ఊపిరిపీల్చుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. సర్కోయిడోసిస్కు గురైన వారు సుదీర్ఘంగా శ్వాస తీసుకోలేరు. తరచూ గుండెజబ్బులకు గురవుతుంటారు. అవే తరహా అనారోగ్య ఇబ్బందులకు రిజ్వాన్ గురయ్యారు. చికిత్స కోసం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల దాతల కోసం ఆయన ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నారు. చివరికి కోల్కతకు చెందిన ఓ దాత నుంచి వాటిని సేకరించారు.
కోల్కత నుంచి వాటిని సేకరించిన వెంటనే రిజ్వాన్కు అమర్చడానికి డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారు. డాక్టర్ సందీప్ అత్తావర్ సారథ్యంలోని డాక్టర్ల బృందం ఆయనకు ఊపిరితిత్తులను మార్పిడి చేసింది. ఈ శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు సందీప్ తెలిపారు. దేశంలో తొలిసారిగా కరోనా సోకిన బాధితుడికి విజయవంతంగా డబుల్ లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసినట్లు చెప్పారు. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం వల్ల కృత్రిమంగా ఆక్సిజన్ను అందించామని తెలిపారు. రిజ్వాన్కు ఎనిమిది వారాల పాటు కృత్రిమంగా ఆక్సిజన్ను అందించామని తెలిపారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పారు.
ఊపిరితిత్తులను మార్పిడి చేసే ప్రక్రియ అత్యంత సంక్లిష్టమైనదని అన్నారు. డిశ్చార్జ్ అనంతరం ఆయనకు కనీసం ఆరు వారాల పాటు నిశిత పర్యవేక్షణ అవసరం ఉంటుందని తెలిపారు. బయో బబుల్ వాతావరణం, జాగ్రత్తగా మందులు వాడాల్సిన అవసరం అవుతుందని డాక్టర్ అత్తావర్ తెలిపారు. హైదరాబాద్ క్రమంగా మెడికల్ హబ్గా ఆవిర్భవిస్తోందని, దేశం నలుమూలల నుంచి ఇక్కడికి శస్త్ర చికిత్సలు, అవయవాల మార్పడి కోసం వస్తున్నారని అన్నారు. విదేశాల నుంచీ మెడికల్ విసాల మీద వచ్చే వారి సంఖ్య పెరిగిందని చెప్పారు.
Recommended Video
డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇదివరకు అమెరికాలోని చికాగోలో విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. భారతీయ సంతతికి చెందిన డాక్టర్ అంకిత్ భరత్ సారథ్యంలో ఈ శస్త్ర చికిత్స పూర్తయినట్లు తెలిపారు. ఇదే తరహా ఆపరేషన్.. ఇటీవలే గుర్గావ్కు చెందిన ఓ వ్యాపారవేత్త కోసం చెన్నైలోని మహాత్మాగాంధీ మెడికల్ హెల్త్కేర్లో నిర్వహించినట్లు చెప్పారు. తాము విజయవంతంగా చేసిన తరువాత.. ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు ఆ చికిత్సకు పూనుకొన్నారని అన్నారు.