ఆ ఐదుగురికి మాత్రమే కరోనా పాజిటివ్: 6 ల్యాబ్స్ సిద్దంగా ఉన్నాయంటూ మంత్రి ఈటెల
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు కరోనావైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరోనాకు సంబంధించిన ఇకపై రాతపూర్వక బులిటెన్లు విడుదల చేస్తామని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ఒక్కరికీ కూడా కరోనావైరస్ సోకలేదని మంత్రి చెప్పారు. దుబాయ్, ఇటలీ, నెదర్లాండ్, స్కాట్లాండ్, ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులకు మాత్రమే కరోనా పాజిటివ్ అని తేలిందని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులకు విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ చేస్తున్నామని చెప్పారు.
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణకొరియా లాంటి దేశాల నుంచి వచ్చేవారికి ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేస్తున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు. వైద్యారోగ్యశాఖ 200 మంది సిబ్బందిని నియమించిందని, ఇప్పటి వరకు విమానాశ్రయంలో 66,182 మందిని స్క్రీనింగ్ చేసినట్లు మంత్రి తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా సోకిందని.. వారిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని వివరించారు.
కరోనా లక్షణాలు లేనివారిని దూలపల్లి, వికారాబాద్లో 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వారిని క్వారంటైన్లలో ఉంచుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 200 మందికిపైగా క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
Recommended Video
హైదరాబాద్లో గాంధీ ఆస్పత్రితోపాటు ఫీవర్ ఆస్పత్రి, ఉస్మానియా, నిమ్స్లో ల్యాబ్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి ఈటెల వివరించారు. తుది పరీక్షల కోసం ఇప్పటి వరకు పుణె పంపించాల్సి వచ్చేదని.. ఇప్పుడు హైదరాబాద్లోనే తుది పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా పరీక్షల కోసం రాష్ట్రంలో 6 ల్యాబ్లు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వివరించారు.