హోలీ విషాదం: వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఐదుగురు మృతి
హోలీ పండుగ సందర్భంగా వరంగల్, జనగామ జిల్లాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు నీట మునిగి చనిపోయారు.
వరంగల్: హోలీ పండుగ సందర్భంగా వరంగల్, జనగామ జిల్లాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు నీట మునిగి చనిపోయారు. నర్మెట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనగామకు చెందిన క్రాంతి, నాగరాజులు ఈత కోసం బొమ్మకూరు రిజర్వాయర్కు వెళ్లారు.
ఈత కొడుతుండగా వారు నీట మునిగి మృతి చెందారు. వీరిద్దరు క్రీస్తుజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.
మరో సంఘటనలో, కురవి మండలంలోని అయ్యగారిపల్లె గ్రామంలో పెద్దచెరువు నీటి ట్యాంకులో మునిగి ఇద్దరు మృతి చెందారు. కురవి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇద్దరు బాలురు హోలీ ఆడారు.
హోలీ అనంతరం వారు స్నానం కోసం వెళ్లారు. అక్కడ నీటిలో మునిగి మృతి చెందారు. మృతి చెందిన వారిని వీరేంధర్ (10), చరణ్(9)లుగా గుర్తించారు.
ఇంకో సంఘటనలో తొర్రూరు మండలంలోని ఫతేపూర్ గ్రామంలో నరేష్ (20) అనే వ్యక్తి ట్యాంకులో మునిగాడు. తొర్రూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను హోలీ అడిన అనంతరం స్నానానికి వెళ్లి నీట మునిగి చనిపోయాడు.