ధర్మవరం బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్.. 50 మందికి అస్వస్థత !!
తెలంగాణ లోని జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా సుమారు 50 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భోజనం తర్వాత విద్యార్థుల అస్వస్థత..
కాగా హాస్టల్లో మొత్తం 150 మంది విద్యార్థులు ఉండగా.. రాత్రి భోజనంగా అన్నం, క్యాబేజీ కూర, కూరగాయల కూర, సాంబారు వడ్డించారు. భోజనం చేసిన కొన్ని గంటలకే పలువురు విద్యార్థులు వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు. మొదట కొద్దిమందికే లక్షణాలు కనిపించగా, తరువాత మరికొంతమందికి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. దీంతో హాస్టల్ సిబ్బంది వారందరినీ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ మేరకు గద్వాల జిల్లా ఆసుపత్రి ఆర్.ఎం. డాక్టర్ అభినేష్ మాట్లాడుతూ.. మొత్తం 50 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. వారిలో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి కొంచెం తీవ్రముగా ఉందని.. మిగతా విద్యార్థులందరూ నిలకడగా ఉన్నారని తెలిపారు. త్వరలోనే వారిని డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.
ఈ ఘటనపై జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆర్డీఓ అలివేలు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. వారు వైద్య సిబ్బందిని వివరాలు అడిగి, హాస్టల్ ఆహార నాణ్యతపై పూర్తి స్థాయి విచారణ చేయాలని ఆదేశించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో ఒకరు మాట్లాడుతూ.. క్యాబేజీ కూర దుర్వాసన వచ్చిందని కానీ అందరూ అదే తిన్నామని వాపోయారు. కొద్దిసేపటికే అందరికీ వాంతులు, తలనొప్పి మొదలయ్యాయని చెప్పారు.
మరోవైపు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు హాస్టల్ను సందర్శించి అన్నం, కూర, సాంబారు నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. ఆహారం పాడవడం లేదా తగిన శుభ్రత పాటించకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications