సంబంధాలు, ఐటీ: 6గురు విదేశీ మేయర్లతో కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో మంచి జీవన పరిస్థితులు కలిగించేందుకు, చక్కటి నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తామని మెట్రోపొలిస్ ప్రపంచ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జీన్ పాల్ హచన్ సహ పలు నగరాల మేయర్లు తెలంగాణ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో జీన్ పాల్ సహా పలువురు మేయర్లు బుధవారం సమావేశమయ్యారు.
వారితో కేటీఆర్ విడివిడిగా సమావేశమయ్యారు. ఆయా నగరాల్లో అనుసరిస్తున్న విధానాలు, ఎదురవుతున్న సమస్యలపై కూలంకషంగా చర్చించారు. ఆ నగరాలతో హైదరాబాద్కు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధ బాంధవ్యాలు, సహకారంపై కూడా చర్చలు జరిగాయి.
మెట్రోపొలిస్ ప్రెసిడెంట్ జీన్ పాల్ హచన్ ఈయన ప్యారిస్ ప్రాంతానికి ఇంఛార్జి మంత్రిగా కూడా పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో జరుగుతున్న తొలి అతిపెద్ద సమావేశం ఇదేనని, దీనికి చాలా ప్రాధాన్యం ఉందని కేటీఆర్ చెప్పారు. జీన్ పాల్ హచన్ ఈ సందర్భంగా కేటీఆర్ను ప్యారిస్కు ఆహ్వానించారు. అక్కడ త్వరలో వాతావరణ మార్పులపై జరగబోయే సదస్సుకు రావాలని పిలిచారు. స్మార్ట్ సిటీల నిర్వచనం పలు అంశాల ఆధారంగా మారుతుందని కేటీఆర్ అన్నారు. మెట్రోపొలిస్లో స్మార్ట్ సిటీలకు వాటి స్మార్ట్నెస్ ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని కూడా సూచించారు.
స్మార్ట్ సిటీలలో నిపుణురాలైన బెర్లిన్ డిప్యూటీ మేయర్ బార్బరా బెర్నింగర్తో కేటీఆర్ భేటీ అయ్యారు. సదస్సు జరుగుతున్న తీరుపట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్కు రావడం ఇదే తొలిసారని, ఇక్కడి ఆతిథ్యం అద్భుతమని ఆమె అన్నారు. స్మార్ట్ సిటీలు, ఐటీ లాంటి అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు. బెర్లిన్ మేయర్ ద్వారా అధికారికంగా తమ నగరానికి ఆహ్వానం పంపుతామని కేటీఆర్కు ఆమె తెలిపారు. జర్మన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్, తెలంగాణ చాలా అనుకూలమైన ప్రాంతాలని ఆమెకు కేటీఆర్ చెప్పారు.
ప్రధానంగా సాంస్కృతిక వ్యవహారాలు, వాణిజ్య వ్యవహారాలు, పట్టణాల సమస్యలపై మషాద్ మేయర్ సోలట్ మొర్తజవితో కేటీఆర్ చర్చించారు. ఇరాన్తో హైదరాబాద్కు చాలా చారిత్రక సంబంధాలున్నాయన్నారు. మషాద్ తమ దేశంలో రెండో అతిపెద్ద నగరమని సొలట్ అన్నారు. తమ నగరానికి ఏటా 2.4 కోట్ల మంది యాత్రికులు వస్తారన్నారు. హైదరాబాద్ నుంచి మషాద్కు నేరుగా విమాన సౌకర్యం కల్పించాలని కేటీఆర్ను కోరారు. ఈ విషయాన్ని తాను కేంద్రం వద్ద ఉంచుతానని కేటీఆర్ చెప్పారు.
జొహాన్నెస్బర్గ్ మేయర్ పార్క్స్ టౌ నేతృత్వంలోని బృందంతో కేటీఆర్ సమావేశమయ్యారు. రెండు నగరాల్లో చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులు ఒకేలా ఉన్నాయని, వాటిపై నేతలిద్దరూ చర్చించుకున్నారు. నగరాభివృద్ధికి తాము అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు టౌ చెప్పారు.
హైదరాబాద్ను పూర్తిగా చూసేందుకు జొహాన్నెస్బర్గ్ నుంచి ఓ బృందాన్ని పంపాలని కేటీఆర్ ఆయన్ను కోరారు. జొహాన్నెస్బర్గ్ సాయంతో హైదరబాద్ను పూర్తి లైఫై (వైఫై తరహా) నగరంగా మార్చాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇక్కడ పర్యావరణానికి అనుకూలమైన నిర్మాణాలు, వికలాంగులకు అనుకూలమైన కట్టడాలు ఉన్నట్లు తెలిపారు.
సావోపోలో నగర మేయర్ రొవెనాతో కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ ప్రజల ఆతిథ్యం అపూర్వమని ఆమె ప్రశంసలు కురిపించారు. తమ నగరంలో 1.1 కోట్ల జనాభా ఉందని చెప్పారు. ఇరు నగరాల మధ్య సహకారంపై ఇద్దరూ చర్చించుకున్నారు. విద్యార్థుల మధ్య సాంస్కృతిక ఎక్స్ఛేంజి కార్యక్రమాలపై కూడా చర్చలు జరిగాయి. నిర్మాణాలు, పట్టణ మౌలిక వసతులు, ఆరోగ్యం, గృహనిర్మాణం, టీకాల లాంటి అంశాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. తమ నగరానికి రావాల్సిందిగా ఆమె కేటీఆర్ను ఆహ్వానించారు.
చివరగా బార్సిలోనా మేయర్ జేవియర్ ట్రయస్, ఆయన బృందంతో కేటీఆర్ సమావేశమయ్యారు. సదస్సు నిర్వహణ పట్ల ముందుగా ట్రయస్ అభినందనలు తెలిపారు. స్మార్ట్ సిటీలు, ఇంధన ఆదా, సాంఘిక సంక్షేమ పథకాలు, బహిరంగ స్థలాల నిర్వహణ, లైటింగ్ లాంటిఅంశాల్లో హైదరాబాద్తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధమని ఆయన అన్నారు. ఏయే అంశాల్లో తాము హైదరాబాద్కు సాయం చేయగలమో అన్న విషయమై ఆ బృందం ఒక పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది.