రీల్స్ చేయండి బహుమతి పట్టండి: తెలంగాణ అటవీ మంత్రిత్వ శాఖ బంపర్ ఆఫర్
హైదరాబాద్: ఇటీవల కాలంలో యువతే కాదు.. పెద్దవారు కూడా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాలో కొత్త ఆలోచనలతో రీల్స్ చేస్తూ అభిమానులను పెంచుకుంటున్నారు. అయితే, ఇలాంటి వారి కోసం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర అటవీశాఖ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
హరితహారం, పచ్చదనం, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తూ రీల్స్ చేసి ప్రతిభను చాటుకోవాలని సూచిస్తోంది. అంతేగాక, ఆకట్టుకునేలా ఉన్న రీల్స్కు తగిన బహుమతులు కూడా ఉంటాయని తెలంగాణ అటవీశాఖ స్పష్టం చేసింది. తమకు పంపిన వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి అవార్డులు ఇస్తామని అటవీ శాఖ తెలిపింది.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 19వ తేదీన హరితోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజున పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సందర్భంగా పచ్చదనం ప్రాముఖ్యత, హరితహారం, పచ్చదనం, చెట్ల ప్రాముఖ్యత అర్బన్ ఫారెస్ట్ పార్కులపై రీల్సీ, వీడియోలను ఒక నిమిషం ఉండేలా [email protected] కు పంపాలనీ అటవీశాఖ సూచించింది. వీడియోలు నిమిషంలోపు ఉంటే బాగుంటుందని తెలిపింది.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూపార్కులు, జాతీయ పార్కులు, పట్టణ అటవీ ఉద్యానవనాల్లోకి జూన్ 19న సందర్శకులను ఉచితంగా అనుమతించాలని నిర్ణయించింది. పిల్లల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది. వర్షాకాలం అనుగుణంగా తొమ్మిదో విడత హరితహారాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సాగునీటి శాఖ ఆధ్వర్యంలో ఉన్న భూముల్లో ప్రత్యేక హరితోత్సవం నిర్వహించాలని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ నిర్ణయించారు. దశాబ్ది సంపద వనాలుగా వాటికి పేరు పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా మారాయి. గ్రామాలు, ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, ప్రధాన రహదారులకు ఇరువైపులా నాటారు. ఇప్పుడు ఇవి చల్లని వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 8 విడతలుగా హరితహారం నిర్వహించారు. ఇప్పటికీ నర్సర్సీల్లో ఉన్న లక్షలాది మొక్కలను నాటేందుకు కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications