ఈటల రాజేందర్తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక భేటీ: హుజూరాబాద్ ఉపఎన్నికపైనే చర్చ
కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గ పాదయాత్రలో ఉన్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ను బుధవారం మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డిలు కలిశారు.
గూడూరు వద్ద కారులో అరగంటపాటు రహస్యంగా ఈ ముగ్గురు మంతనాలు జరపడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఏం మాట్లాడుకున్నారనేది ఆసక్తిగా మారింది. ఉపఎన్నికలో ఈటల గెలుపే లక్ష్యంగా చర్చలు జరిగాయని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల కొండా విశ్వేశ్వర్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని, అయితే ఎప్పుడు చేరతాననేదానిపై త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఈ క్రమంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఈటల రాజేందర్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, ఈ భేటీపై బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొంత క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ను ఓడించేందుకు అందరూ ఒకే వేదికపైకి వచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. అయితే, కాంగ్రెస్ పార్టీ కూడా ఈటల రాజేందర్ కు ఉపఎన్నికలో మద్దతు పలుకుతుందా? అనేది తేలాల్సి ఉంది.
ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ప్రజా దీవెన పేరుతో పాదయాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. తనను ఉపఎన్నికలో గెలిపించాలంటూ ప్రజలను కోరారు. ఈటల రాజేందర్ తోపాటు పలువురు బీజేపీ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.