విషాదం : నిజామాబాద్ మాజీ ఎంపీ కన్నుమూత..కేసీఆర్ దిగ్భ్రాంతి..
తెలంగాణ ఉద్యమ తొలితరం నాయకుడు,నిజామాబాద్ మాజీ ఎంపీ ఎం.నారాయణ రెడ్డి ఆదివారం కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నారాయణరెడ్డి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
నిజానికి నారాయణరెడ్డికి నేడు నిజామాబాద్లో పౌర సన్మానం జరగాల్సి ఉంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు. ఇంతలోనే ఆయన మరణవార్త తెలియడంతో.. అదే వేదికపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి,పలువురు నేతలు ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. కాగా,1967లో నిజామాబాద్ నుంచి ఇండిపెండెంట్ ఎంపీగా నారాయణరెడ్డి గెలుపొందారు. ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో తెలంగాణ సాధన గురించి 45నిమిషాలు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆ తర్వాత ఒక పర్యాయం ఎమ్మెల్యేగానూ పనిచేసిన ఆయన.. టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించారు. కొంతకాలం రాష్ట్ర చెరుకు రైతు సంఘం అధ్యక్షుడిగానూ ఉన్నారు. విద్యావేత్తగా,న్యాయవాదిగా ఆయన మంచి పేరు ఉంది.