జైపాల్ స్కెచ్తోనే నాగం కాంగ్రెస్లోకి, నాతో చర్చించలేదు: దామోదర్ రెడ్డి
హైదరాబాద్: మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక మాజీ కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి కీలకంగా వ్యవహరించారని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి చెప్పారు. నాగం జనార్ధన్ రెడ్డి పార్టీలో చేరుతున్న విషయాన్ని తనతో చర్చించలేదన్నారు.
మాజీ మంత్రి నాగం జనార్ధన్రెడ్డి ఏప్రిల్ 25 వ తేదిన న్యూఢిల్లీలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మాజీ మంత్రి నాగం జనార్ధన్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జీగా ఉన్న కుంతియా పార్టీలో చేరికల విషయాన్ని ఇతరులతో చర్చించకుండా చేయడంపై దామోదర్ రెడ్డి మండి పడుతున్నారు.నాగం చేరికపై పార్టీ నాయకత్వం వ్యవహరించిన తీరును ఆయన తప్పుబడుతున్నారు.
నాగం వెనుక జైపాల్ స్కెచ్
కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి చేరిక విషయంలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి స్కెచ్ వేశారని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆరోపించారు. నాగం జనార్ధన్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావడంలో జైపాల్ రెడ్డి పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే జిల్లాలోని కొందరు నాయకులను బలహీనపర్చేందుకే పార్టీలోకి నాగంను తెచ్చారని దామోదర్ రెడ్డి విమర్శించారు.
నాగం చేరిక విషయం చెప్పలేదు
మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి పార్టీలో చేరే విషయాన్ని తమకు మాట మాత్రంగా కూడ చెప్పలేదన్నారు. నాగం జనార్ధన్రెడ్డిని పార్టీలో చేర్చుకొనే విషయమై తమతో చేర్చిస్తామని హామీ ఇచ్చిన నాయకత్వం ఆ దిశగా అడుగులు వేయలేదన్నారు. పార్టీ అగ్రనేతలందరితో కూడ తాను చర్చించినప్పటికీ ఎవరూ కూడ నాగం జనార్ధన్ రెడ్డి చేరిక విషయాన్ని తన దృష్టికి తీసుకురాలేదన్నారు.
కాంగ్రెస్కు వ్యతిరేకంగా నాగం
25 ఏళ్ళకు పైగా మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన చెప్పారు. ఇంతకాలం పాటు కాంగ్రెస్ పార్టీని ఎలా అణగదొక్కాలనే ప్రయత్నాలు చేశారని ఆయన గుర్తు చేశారు.
కుంతియా తీరుపై దామోదర్ రెడ్డి అసంతృప్తి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జీ కుంతియా తీరుపై ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకపోవడంపై కుంతియా ప్రస్తావిస్తున్నారని చెప్పారు. కానీ, కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బతీసిన వ్యక్తిని పార్టీలోకి తీసుకొన్నారని చెప్పారు. మరో వైపు చేరికల విషయమై స్థానిక నాయకత్వంతో చర్చించకుండానే నిర్ణయం తీసుకోవడంపై దామోదర్ రెడ్డి పార్టీ అగ్రనేతలపై విరుచుకుపడ్డారు.