హైదరాబాద్లో ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు - ఏకంగా అయిదు రోజులు ఆ రోడ్లు మూసివేత..!!
హైదరాబాద్: దేశంలో మొట్టమొదటి సారిగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్కు హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రతినిధులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ఇది. విద్యుత్ ఆధారంగా నడిచే సింగిల్ సీటర్ కారును ఈ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం వినియోగిస్తారు. భారత్లో ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా రేసింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి.
తొలిసారిగా దేశంలో..
ప్రస్తుతం న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్లల్లో మాత్రమే ఈ ఫార్ములా-ఈ రేసింగులు నడుస్తున్నాయి. వాటి సరసన హైదరాబాద్కు కూడా చేరింది. దీనితో అంతర్జాతీయ ఖ్యాతిని సాధించినట్టయింది. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది. దేశంలోనే తొలిసారిగా స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ ఇది.
అన్నీ సిద్ధం..
హుస్సేన్ సాగర్ చుట్టూ 2.3 కిలోమీటర్ల సర్క్యుట్ ఓవర్లుకింగ్పై ప్రత్యేకంగా రేసింగ్ ట్రాక్ను నిర్మించే ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్, ఎన్టీఆర్ పార్క్, సంజీవయ్య పార్క్ మీదుగా ఈ ట్రాక్ ఉంటుంది. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ హుస్సేన్ సాగర్ చుట్టూ జరుగనుంది. రేస్ నడుస్తోన్న సమయంలో అవసరమైన పిట్స్టాప్స్, ప్రేక్షకులు తిలకించడానికి వీలుగా సీటింగ్, ఫెన్సింగ్ నిర్మాణం వంటి పనులను చేపట్టింది. దీనికోసం చెట్లను కూడా నరికేసింది.
19, 20 తేదీల్లో..
ఈ నెల 19, 20 తేదీల్లో ఫార్ములా ఈ కార్ల రేసింగ్ నిర్వహించడానికి సమాయాత్తమైంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఇవ్వాళ్టి నుంచి ట్రాఫిక్ ఆంక్షలను కూడా అమలులోకి తీసుకొచ్చింది. అయిదు రోజుల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ రాత్రి 10 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
మళ్లింపు ఇలా..
దీని ప్రకారం- ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లడానికి అనుమతి లేదు. ఈ ట్రాఫిక్ను వీవీ విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు మళ్లించారు. అలాగే- బుద్ధ భవన్/నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాణిగంజ్/ట్యాంక్బండ్ వైపు మళ్లించారు. రసూల్పురా/మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లించారు.
ఆ మార్గాల్లో..
ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కట్ట మైసమ్మ దేవాలయం/లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్/రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్ జంక్షన్ వద్ద రవీంద్ర భారతి వైపు మళ్లించారు.
శుక్రవారం నుంచి మూసివేత..
ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ లేదా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాజ్దూత్ లేన్ వైపు మళ్లించారు. ఫార్ములా ఈ కార్ల రేసింగ్ కారణంగా ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ను శుక్రవారం నుంచి సోమవారం వరకు మూసివేయనున్నారు. అఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు ట్యాంక్బండ్ మీదుగా కాకుండా తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కట్ట మైసమ్మ, లోయర్ ట్యాంక్బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.