హైద్రాబాద్లో పేలుళ్లకు ఐసిస్ కుట్ర: భారీ స్కెచ్, పోలీసులకే బెదిరింపు?
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పైన ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదుల కన్ను పడిందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హైదరాబాదులో సోదాలు నిర్వహించారు.
ఐసిస్ సానుభూతిపరులు హైదరాబాదులోకి ప్రవేశించినట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పదిచోట్ల సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా పదకొండు మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
వారు పేలుళ్లకు కుట్ర చేసి ఉన్నారా ఆరా తీయాల్సి ఉంది. అనుమానితుల నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలో సోదాలు నిర్వహిస్తున్నారు. 24 గంటలుగా సోదాలు నిర్వహిస్తున్నారు.
మొగల్ పుర, భవానీపూర్, చాంద్రాయణగుట్ట, తలాబ్ కట్ట, ఫలక్ నుమా తదితర పాతబస్తీ ప్రాంతాల్లో ఎన్ఐఏ, సిట్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కాగా, ఫేస్ బుక్ ద్వారా ఐసిస్ వారికి పరిచయమైనట్లుగా తెలుస్తోంది.
పోలీసుల అదుపులో వీరే...
పోలీసులు అరెస్టు చేసిన వారిలో మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, మహ్మద్ ఇబ్రహీం, అబ్దుల్లా బిన్ మహ్మద్ అల్మోడీ, అబిన్ మహ్మద్, మహ్మద్ ఇర్ఫాన్, ముజఫర్ హుస్సేన్ తదితరులు ఉన్నారని తెలుస్తోంది.
వీళ్ల నుంచి పోలీసులు రెండు 9ఎంఎం పిస్టళ్లతో పాటు పేలుడు పదార్థాలు, ఆయుధాలు, విదేశీ కరెన్సీ, ఎలక్ట్రానిక్ వస్తువులు, అమోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. రూ.15 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఎన్ఐఏ అధికారులు.. ఇబ్రహీం ఇంటికి వెళ్లిన సమయంలో కుటుంబ సభ్యులు బెదిరించారని, ఐదు నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరంచారని వార్తలు వస్తున్నాయి. ఐసిస్ సానుభూతిపరులు హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ కూడా ప్రాక్టీస్ చేశారని తెలుస్తోంది.
ఎన్ఐఏ విచారణలో భయంకర నిజాలు
అదుపులోకి తీసుకున్న ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ విచారించిందని, ఈ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయని తెలుస్తోంది. చాంద్రాయణగుట్ట పరిధిలో వారు షూటింగ్ ప్రాక్టీస్ చేశారు. షూటింగ్ చేస్తూనే, బాంబులు విసరడాన్ని కూడా ప్రాక్టీస్ చేశారు. రద్దీ ప్రాంతాల్లో కాల్పులకు స్కెచ్ వేసారు.