తెలంగాణలో నాల్గోరోజు 144 మంది నామినేషన్లు: ప్రముఖులు వీరే
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 144 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పదిహేడు లోక్సభ స్థానాలకు శనివారం నాటికి 156 మంది నామినేషన్లు వేశారు. ఆదివారం సెలవు తర్వాత సోమవారం 144 మంది 169 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఇవాళ మరో సెట్ దాఖలు చేశారు.
సోమవారంనాడు ఆదిలాబాద్లో మూడు, పెద్దపల్లిలో 14, కరీంనగర్లో 13, నిజామాబాద్లో 12, జహీరాబాద్, మెదక్, ఖమ్మంలో ఏడు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక, మల్కాజిగిరి, నల్గొండ, వరంగల్లో 10, సికింద్రాబాద్లో 9, హైదరాబాద్, నాగర్ కర్నూలులో ఆరు, చేవెళ్లలో 11, మహబూబ్నగర్లో నాలుగు, భువనగిరిలో 11, మహబూబాబాద్లో నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు శ్రీగణేష్, నివేదిత సహా 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతా మహేందర్రెడ్డి నామినేషన్ వేశారు. తూంకుంట పురపాలక పరిధిలోని మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో ఆమె నామపత్రాలు దాఖలు చేశారు.

కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్రావు నామినేషన్ వేశారు. మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం సమక్షంలో ఆయన నామినేషన్ వేయడం గమనార్హం. వరంగల్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య కూడా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
తన తండ్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్ శాసన సభ్యులు, నేతలు వెంటరాగా కావ్య తన నామపత్రాలను జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు అందచేశారు. వరంగల్ పార్లమెంటు స్ధానానికి బీఆర్ఎస్ అభ్యర్ధిగా సుధీర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా క్యామ మల్లేశ్ నామినేషన్ వేశారు.
మరోవైపు, చేవెళ్ల బీజీపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సమక్షంలో ఆర్వో అధికారికి విశ్వేశ్వర్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు చేవెళ్ల నుంచి తన సతీమణి సంగీతారెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి విశ్వేశ్వర్ రెడ్డి, భారీ ర్యాలీ నిర్వహించారు.
జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ రుద్రారం గణేశ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నామినేషన్ వేశారు. పాటిల్ నామినేషన్ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. రాష్ట్రంలో హైదరాబాద్ సహా అన్ని స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని పీయూష్ గోయల్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థిగా ప్రొఫెసర్ సీతారాంనాయక్ నామినేషన్ దాఖలు చేశారు. సీతారాంనాయక్ నామినేషన్ సందర్భంగా పట్ఠణంలో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. రోడ్షోలో బోనాలు, పోతురాజుల విన్యాసాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. 70 ఏళ్లుగా పరిష్కారం కానీ ఎన్నో సమస్యలకు మోడీ సర్కార్ పరిష్కారం చూపిందన్నారు కేంద్రమంత్రి రిజిజు. ఎంపీగా సీతారాంనాయక్ను గెలిపించాలని ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications