కిట్టీ పార్టీలిచ్చి ప్రముఖులకు రూ. కోట్లలో కుచ్చుటోపీ.. వ్యాపారవేత్త శిల్ప అరెస్ట్
హైదరాబాద్: వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు, అధిక వడ్డీల పేరుతో పేరుతో మోసం చేసిన కిలాడీ లేడీ ఆట కట్టించారు పోలీసులు. తమను రూపాయలు కోట్లలో మోసం చేశారంటూ వ్యాపారవేత్త శిల్పా చౌదరి అనే మహిళ, ఆమె భర్తపై బాధితులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రూ. కోటి 5 లక్షలు కాజేసిన శిల్పా దంపతులు
కోటి 5 లక్షల రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని దివ్య అనే మహిళ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు గండిపేట సిగ్నేచర్ విల్లాస్లో నివాసం ఉంటున్న శిల్ప ఆమె భర్తను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె బ్యాంక్ ఖాతాలను పరిశీలించారు.
విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన శిల్పా చౌదరి
అంతేగాక, దివ్య నుంచి రూ. కోటికిపైగా నగదు తీసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు తిరిగి చెల్లించకపోవడంతో శిల్ప, ఆమె భర్తను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన శిల్పా చౌదరి తనను వ్యాపారవేత్తగా పరిచయం చేసకుని పదుల సంఖ్యలో రూ. కోట్ల మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రముఖ ఇంటర్నెన్షనల్ స్కూల్ దంపతులను నట్టేట ముంచిన శిల్పా దంపతులు బాధితుల ఫిర్యాదుతో శిల్పా చౌదరి , శ్రీనివాస్పై చీటింగ్ కేసుతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కిట్టీ పార్టీలతో రూ. కోట్లలో టోపీ.. బాధితుల్లో సినీతారలు కూడా
హై ప్రొఫైల్ ముసుగులో మోసాలకు శిల్పా దంపతులు మోసాలకు తెరతీశారు. వీరి బాధితుల్లో ప్రముఖ సినీ నటులు కూడా ఉన్నట్లు సమాచారం. బడాబాబుల బిడ్డలు, కోడళ్లు టార్గెట్గా కిట్టీ పార్టీలు నిర్వహించేదట శిల్పా చౌదరి. పార్టీలో తన బిజినెస్ ప్రపొజల్స్ పెట్టి ఆకర్షించేది. పదేళ్ల నుంచి కిట్టి పార్టీ నిర్వహించి పలువురి దగ్గర కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలికి చెందిన దివ్య ఫిర్యాదుతో శిల్పా చౌదరి దంపతుల మోసాలు వెలుగుచూశాయి. ఇది ఇలావుండగా, మాచవరంలోనూ ఇలాంటి మోసమే జరిగింది. మాచవరానికి చెందిన చిట్టిప్రోలు నరసింహరావు పెద్ద మొత్తంలో మోసపోయారు. ఓ వ్యక్తి చెప్పడంతో ఓ ప్రైవేట్ యాప్ డౌన్లోడ్ చేశాడు. దానిలో బ్యాంక్కు సంబంధించిన యూజర్ నేమ్, పాస్ వర్డ్ నమోదు చేశాడు. ఆ తర్వాత తన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 9.50 లక్షలు డ్రా అయిన విషయాన్ని గుర్తించాడు. ఈ క్రమంలో బాధితుడు బ్యాంకు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.