హైడ్రాకు కొత్త బాధ్యతలు అప్పగింత- స్వయంగా రేవంత్ ఆకస్మిక తనిఖీలు
Revanth Reddy: రాష్ట్రంలో ఇసుక ఉచిత సరఫరా, అక్రమ తరలింపు వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇసుక రీచ్ల వద్ద నిఘా ముమ్మరం చేయాలని నిర్ణయించింది. కార్యకలాపాలపై డేగకన్ను వేసింది.
హైడ్రా కమిషనర్తో పాటు..
గనులు, ఖనిజాభివృద్ధి సంస్థ కార్యకలాపాలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.

పలు కీలక నిర్ణయాలు..
ఈ సమీక్ష సందర్భంగా రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితంగా..
ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని, ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
స్వయంగా ఆకస్మిక తనిఖీలు..
అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా ఇసుక సరఫరా జరగాల్సిన అవసరం ఉందని, విధి నిర్వహణలో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు ఆ బాధ్యతలను అప్పగించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా తక్షణ చర్యలను తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ఇసుక బ్లాక్ మార్కెట్ను అరికట్టడం..
ఇసుక బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని, ఇందులో భాగంగా జిల్లాల వారిగా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లకు ఆ బాధ్యతలను అప్పగించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిఘా..
అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి రీచ్ వద్ద కూడా 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని, ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేయాలని అన్నారు.
బుక్ చేసిన 48 గంటల్లోగా..
బుక్ చేసిన 48 గంటల్లోగా ఇసుక వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ పేర్కొన్నారు. ప్రాంతాల వారిగా సమీప రీచ్ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరే వ్యవస్థను రూపొందించాలని అన్నారు. సమస్య తలెత్తినప్పుడు వెంటనే పరిష్కారించేలా ఈ వ్యవస్థ ఉండాలని సూచించారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారాయన.
ఆన్లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులు..
నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని చెప్పారు. ఆన్లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులు చేయాలని, ఆఫీస్ టైమింగ్స్లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళలను సవరించాలని అన్నారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి సంబంధించి ముఖ్యమంత్రి @revanth_anumula గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.… pic.twitter.com/967IbIWD9J
— Telangana CMO (@TelanganaCMO) February 10, 2025












Click it and Unblock the Notifications