తెలంగాణాలో బీజేపీని గెలిపిస్తే ఉచితంగా అయోధ్య దర్శనం!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు అయోధ్య రామయ్య దర్శనానికి ఉచితంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ కారు ను, కమీషన్ల ప్రభుత్వాన్ని మోడీ గ్యారేజ్ కు పంపించాల్సి సమయం ఆసన్నమైందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పిలుపు నిచ్చారు .
తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ లోని చాయ సోమేశ్వరుడు, చెరువు గట్టు రామలింగేశ్వర స్వామి, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ని తలచుకుంటూ తెలంగాణ, భారత్ భవిష్యత్ కోసం బీజేపీ అభ్యర్ధులకు ఓటు వేయాలని అన్నారు.

తెలంగాణ లో మీరు ఇచ్చే ఓటు ద్వారా బీసీ ముఖ్యమంత్రి అనే ప్రజల కల నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఎంబీబీఎస్, ఎండీ చదువుకునే విద్యార్థుల కోసం 25శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు.. రాజ్యాంగ విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్ ను తొలగించి దాన్ని బీసీ, ఎస్సీ , ఎస్టీ లకు వర్తింపచేస్తామని అన్నారు. మేం అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తామని హామీ ఇచ్చారు.

వారసులను సీఎం, PM చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై, సోనియా గాంధీపై మండిపడ్డారు. ఈ ఎన్నికలు మోడీ సుపరిపాలన, కెసిఆర్ అహంకార పాలనకు మధ్య జరుగుతున్నాయన్నారు. కాళేశ్వరం కుంభకోణం, మద్యం కుంభకోణాలతో పాటుమియాపూర్ భూముల కుంభకోణం బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు.
బీజేపి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ చేసిన అవినీతి కుంభకోణాలపై దర్యాప్తు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. జనవరి 22నఅయోధ్య లో రామ మందిరం ప్రారంభిస్తామని అన్నారు. రామ మందిరాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications