ఫ్రాన్స్ అబ్బాయితో ఖమ్మం అమ్మాయి లవ్.. ఖండాలు దాటిన ప్రేమ కథా చిత్రం
ప్రేమ కేవలం రెండు అక్షరాల మాట కాదు... రెండు మనస్సులు నిజంగా కలిస్తే... దేశాలు, భాషలు, సంప్రదాయాలు కాదు... ఖండాంతరాలే అడ్డు కాలేవని నిరూపించిన ఓ ప్రేమ కథ ఇది. ఫ్రాన్స్ అబ్బాయి... ఖమ్మం జిల్లాకు చెందిన అమ్మాయి... పెద్దలను ఒప్పించి... తెలుగుతనం ఉట్టిపడేలా ఖమ్మంలో పెళ్లి చేసుకున్న ఈ జంట కథ మీకోసం.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన యువతి, ఫ్రాన్స్ దేశానికి చెందిన యువకుడితో వివాహం.. ఈ అంతర్జాతీయ ప్రేమ పెళ్లికి ఖమ్మం వేదికైంది. దేశాలు, భాషలు, సంప్రదాయాలు వేర్వేరు అయినప్పటికీ ప్రేమ ముందు అవన్నీ చిన్నవేనని ఈ జంట నిరూపించింది. మహ్మదాపురం గ్రామానికి చెందిన జినక వెంకన్న, ఎల్లమ్మ దంపతుల పెద్ద కుమార్తె జినక ప్రశాంతి. ఆమె పాఠశాల విద్యను ఖమ్మం జిల్లాలోని గురుకులంలో పూర్తి చేసి, ఖమ్మంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివారు. అనంతరం ఉన్నత చదువుల కోసం ఎంఎస్ చేయడానికి ఫ్రాన్స్ దేశానికి వెళ్లారు. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగంలో చేరారు.

ఈ క్రమంలో అదే కంపెనీలో పనిచేస్తున్న ఫ్రాన్స్ దేశానికి చెందిన నాథన్ క్రిస్టోఫ్ జూబర్ట్తో పరిచయం ఏర్పడింది. మొదట స్నేహంగా మొదలైన ఈ పరిచయం కాలక్రమేణా ప్రేమగా మారింది. రెండు దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు వేర్వేరు అయినప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకుని వివాహానికి నిర్ణయించారు. వివాహాన్ని భారతదేశంలోనే, భారతీయ సంప్రదాయంలో జరుపుకోవాలన్న వరుడి కోరిక మేరకు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించారు. అనంతరం ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లో ఉన్న జీఎమ్ఆర్ కళ్యాణ మండపంలో సోమవారం హిందూ-క్రైస్తవ సంప్రదాయాల మేళవింపుతో ఘనంగా వివాహం జరిగింది.
ఫ్రాన్స్ నుంచి వచ్చిన వరుడి కుటుంబ సభ్యులు భారతీయ వస్త్రధారణలో పాల్గొని వివాహ వేడుకల్లో సందడి చేశారు. తెలంగాణ జానపద డీజే పాటలకు స్థానికులతో కలిసి విదేశీ అతిథులు స్టెప్పులు వేయడంతో పెళ్లి వాతావరణం ఉత్సాహంగా మారింది. వివాహం ఆద్యంతం హాజరైన వారందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వధువు ప్రశాంతి మాట్లాడుతూ, నాథన్ వ్యక్తిత్వం, ఆలోచనలు తనకు ఎంతో నచ్చాయని, అందుకే అతడిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నట్లు తెలిపారు.
ప్రేమకు సరిహద్దులు ఉండవని, మనసులు కలిస్తే ఖండాంతరాలు కూడా అడ్డుకాలేవని నిరూపించిన ఈ వివాహం ఖమ్మంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.












Click it and Unblock the Notifications