నేడే హరికృష్ణకు అంతిమ వీడ్కోలు: ప్రముఖుల నివాళులు, ట్రాఫిక్ ఆంక్షలు
Recommended Video
హైదరాబాద్: టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి గురువారం సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలను నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.
గురువారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మెహిదీపట్నంలోని నందమూరి హరికృష్ణ స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు.
హరికృష్ణ అంతిమ యాత్ర నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మెహదీపట్నం ఎన్ఎండీసీలోని హరికృష్ణ ఇంటి నుంచి అంతిమ యాత్ర మొదలై సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం, రేతిబౌలి, నానల్నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్పేట్నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్ నుంచి కుడివైపునకు తిరిగి జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మహాప్రస్థానం చేరుకుంటుంది.
మానవత్వం మరువలేదు: నందమూరి అభిమానులకు హరికృష్ణ రాసిన చివరి లేఖ ఇదే
హరికృష్ణ అంతిమ యాత్ర దృష్ట్యా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మాసబ్ ట్యాంక్ నుంచి సరోజిని ఆస్పత్రి మార్గంలో వెళ్లే వాహనదారులు బజార్ఘట్, ఆసిఫ్నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. గచ్చిబౌలి నుంచి వచ్చేవారు ఫిల్మ్నగర్ మీదుగా వెళ్లాలని ఆంక్షలు విధించారు.
కాగా, మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసంలో ఉన్న ఆయన పార్థీవ దేహాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం ఉదయం హరికృష్ణకు నివాళులర్పించారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత, సినీనటుడు నాగార్జున, మైసూరా రెడ్డి, మంత్రి లోకేష్, తదితరులు నివాళులర్పించారు. కాగా, భారీ సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.