దుండిగల్లో షోలాపూర్ మహిళపై నలుగురు యువకుల గ్యాంగ్ రేప్.. వీళ్లిక మారరా!!
స్త్రీలను గౌరవించాలి అని, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదని ప్రభుత్వాలు ఎంత చెప్పినా చాలా మంది మగవారిలో స్త్రీల పట్ల చులకన దృష్టి మారడం లేదు. మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిపై కఠిన శిక్షలు అమలు జరుగుతున్నా మృగాళ్లు అవేవి పట్టించుకోకుండా రెచ్చిపోతూనే ఉన్నారు.
నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడవాళ్ళు ఒంటరిగా కనిపిస్తే చాలు విచక్షణ మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న అత్యాచారాలను కట్టడి చెయ్యటం పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారైంది. తాజాగా హైదరాబాద్ నగర శివార్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నగర శివార్లలోని దుండిగల్ లో ఓ మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది.
2 రోజుల క్రితం ఓ మహిళ ఉపాధి నిమిత్తం షోలాపూర్ నుంచి దుండిగల్ కు వచ్చింది. ఈ క్రమంలో సదరు మహిళను కొందరు దుండగులు శుక్రవారం అర్ధరాత్రి గండిమైసమ్మ లోని బార్ వెనుకకు తీసుకువెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి గురైన బాధిత యువతిని పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.
ఇక నిందితులను గుర్తించిన పోలీసులు వారంతా దుండిగల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బస్తీకి చెందిన నరసింహ, కుద్దూస్, కుమ్రుద్దీన్, ఇమామ్ లుగా గుర్తించారు. వారంతా ఆటో డ్రైవర్ లుగా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ అత్యాచార కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని నాగపూర్ లో 2 రోజుల క్రితం మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. గతంలో రికార్డు చేసిన వీడియోను చూపించి ఒక విద్యార్థినిని బెదిరించిన బాయ్ ఫ్రెండ్ మరో ఇద్దరు సహచరులతో కలిసి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినితో సన్నిహితంగా ఉంటున్న ఓ యువకుడు, ఆమె తనతో ఉన్న దృశ్యాలను వీడియో రికార్డ్ చేసి, ఆపై ఆ వీడియో రికార్డు చూపించి బెదిరిస్తూ తన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీనిపై విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.