ఉప్పల్ కేటీఆర్ సభలో పేలిన గ్యాస్ బెలూన్లు, పలువురికి గాయాలు
హైదరాబాద్: ఉప్పల్ పారిశ్రామికవాడలో జరిగిన మంత్రి (ఆపద్ధర్మ) కేటీ రామారావు సభలో గ్యాస్ బెలూన్లు పేలాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయాలు తీవ్రంగానే అయ్యాయి. యువకుడికి చేయి బాగా కాలిపోయింది.
కేటీఆర్ సభలో గ్యాస్ బెలూన్లు పేలిపోయి, కొద్దిగా మంటలు వచ్చాయని, ఈ ఘటనలో కొందరికి గాయాలు అయ్యాయని, వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
ఇదిలా ఉండగా, ఉప్పల్ నుంచి మల్లాపూర్ వరకు జరిగిన రోడ్డు షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నాలుగేళ్లలో అభివృద్ధి అంటే ఏమిటో చూపించామని చెప్పారు. ఉప్పల్ను ఐటీకి కేరాఫ్ అడ్రస్గా మారుస్తామని చెప్పారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఉప్పల్లో పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పారు.

తెలంగాణ వస్తే గందరగోళం అవుతుందని ఎన్నో అపోహలు సృష్టించారని మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామని చెప్పారు. ఉప్పల్ పారిశ్రామిక వాడలోకి ఐటీ పరిశ్రమలు వస్తాయని తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గంలో రూ.2,184 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు.
ఉప్పల్ ప్రాంతం నుంచి ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుందని చెప్పారు. హైదరాబాద్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూసుకున్నామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, ప్రపంచ మేటి కంపెనీలు హైదరాబాద్ నగరానికి తరలి వస్తున్నాయని చెప్పారు. కేటీఆర్ ఉప్పల్ అభ్యర్థి భేతి సుభాష్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు.












Click it and Unblock the Notifications