ఇచ్చారు సెలవులు..! తీసుకోవాలి జాగ్రత్తలు..! లేకపోతే ఇల్లు గుల్లే...!!
హైదరాబాద్ : వేసవిలో పిల్లలకు సెలవులు ఇచ్చారు. సరదాగా బంధువుల ఇళ్లకో, విహార యాత్రలకో, సొంత గ్రామాలకో వెళ్లడం సర్వసాధారణం.. ఇళ్లకు తాళాలు వేసి వెళ్తున్నారా..? దొంగల భయం ఉందా...? మీ సొమ్ము భద్రంగా ఉండాలంటే పలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. పరీక్షలు పూర్తి కాగానే ప్రజలు విహార యాత్రలకు, సొంత ఊర్లకు వెళ్తుంటారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలకు రక్షణ కంచెను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వివరాలు స్థానిక పోలీసు స్టేషన్లో ఇవ్వండి..!!
ఊళ్లకు వెళ్తున్నారా..! వివరాలు స్థానిక పోలీసు స్టేషన్లో ఇవ్వండి..!!
మరో వైపు ఎండలు మండిపోతుండడంతో రాత్రి సమయాల్లో ఇంటికి తాళం వేయకుండా, కేవలం గడియ పెట్టి ఇంటి డాబాలపై పడుకుంటారు. మరికొందరు ప్రధాన ద్వారం పక్కన ఉండే కిటికీలు తెరిచి పడుకుంటారు. ఇలా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు దొంగతనాలు జరిగేందుకు అవకాశం కల్పించినట్లవుతోంది.

కిటికీలను పూర్తిగా మూసేయాలి..!!
ఇంటికి తాళం వేసి బయటపెట్టొద్దు..! కిటికీలను పూర్తిగా మూసేయాలి..!!
ఈ క్రమంలో ప్రజలు వస్తువులు పోగొట్టుకోకుండా జాగ్రత్తలతో చోరీలకు కళ్లెం వేసేందుకు పోలీసులు ప్రచారం ప్రారంభించారు. ఎండాకాలంలో దొంగలకు కలిసొచ్చేది మధ్యాహ్నం, అర్ధరాత్రి సమయాలే. అందులోనూ దొంగలకు అమావాస్య మరింతగా కలిసి వస్తుంది.

ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా..! అనుమానాస్పద వ్యక్తులను అస్సలు నమ్మకండి..!!
అమావాస్య చీకటిలో వెలుతురు లేకుండా అంధకారం ఉండడం దొంగతనాలకు పాల్పడేందుకు కలిసి వచ్చే అంశమని పలువురు దొంగలు పట్టుబడినప్పుడు బయటపడ్డ విషయం. ఈ కాలంలో దొంగలు మధ్యాహ్నం సమయంలో రెక్కీ వేసుకుని రాత్రి సమయాల్లో చోరీలకు తెగబడుతున్నారు.

విలువైన వస్తువులను లాకర్లలో పెట్టుకోవాలి..! డబ్బు, ఆభరణాల పట్ల గోప్యత అవసరం..!!
తెరిచి ఉన్న కిటికీలోంచి కర్ర, ఇనుప రాడ్లతో ప్రధాన ద్వారాలను తెరవడం లేదా వాటితో కనిపించే విలువైన వస్తువులను దొంగిలిస్తారు. దీనికోసం సరైన భద్రత ప్రమాణాలను పాటించని ఇండ్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే ఇండ్లను ఎంపిక చేసుకుంటారు. అంతే గాకుండా ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలను కూడా దొంగలు ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఈ చోరీలను అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications