జీహెచ్ఎంసీ కమిషనర్ బదిలీ- ఆయన స్థానంలో..!!
హైదరాబాద్: వర్షాకాలంలో హైదరాబాద్ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా తయారవుతుందనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. డ్రైనేజీలన్నీ పొంగిపొర్లుతుంటాయి. రోడ్లన్నీ జలమయం అవుతుంటాయి. వీధులు, కాలనీలు.. నదుల్లా మారుతుంటాయి. ప్రతి వర్షాకాలంలోనూ హైదరాబాద్, సికింద్రాబాద్లల్లో ఇవే తరహా పరిస్థితులు కనిపిస్తుంటాయి.
ఇటీవలే కురిసిన భారీ వర్షానికీ హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. రోడ్లనూ ముంచెత్తింది. వాహనాల రాకపోకలు గంటల కొద్దీ స్తంభించిపోయాయి. వచ్చే రెండు రోజుల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం సూచించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాకు హెచ్చరికలను జారీ చేసింది.

వర్షం పడిన ప్రతీసారీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వైఫల్యాలు ప్రస్తావనకు రావడం ఆనవాయితీగా మారింది. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి తలెత్తిందంటూ మీడియాలో కథనాలు వెలువడుతుంటాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాల గురించి పట్టించుకోకపోవడం వల్ల వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోందనే ఆరోపణలు వినిపిస్తుంటాయి.

ఈ పరిస్థితుల మధ్య తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. జీహెచ్ఎంసీ కమిషనర్, సీనియర్ ఐఎఎస్ అధికారి డీఎస్ లోకేష్ కుమార్ను బదిలీ చేసింది. ఆయనను అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా నియమించింది. ఆర్థిక శాఖ కార్యదర్శి డీ రొనాల్డ్ రాస్ను జీహెచ్ఎంసీ కమిషనర్గా అపాయింట్ చేసింది.
ఎక్స్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను సంయుక్త ఎన్నికల ప్రధానాధికారిగా నియమించింది. ప్రస్తుతం ఈ స్థానంలో పని చేస్తోన్న ఐఎఫ్ఎస్ అధికారి టీ రవికిరణ్ను రిలీవ్ చేసింది. వెయిటింగ్లో ఉన్న ముషర్రాఫ్ అలి ఫారూఖీని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్గా అపాయింట్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications