గ్రేటర్లో వైసీపీ ఓట్లు ఎవరికి పడినట్టు: రఘునందన్ వ్యాఖ్యల ఎఫెక్ట్?: గులాబీకే గంపగుత్తగా?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వెనుకంజ వేస్తోంది. రెండో స్థానానికి పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. ఇదివరకటి ఎన్నికలతో పోల్చుకుంటే.. ఈ సారి కమలనాథుల ఓట్ల శాతం భారీగా పెరిగినప్పటికీ.. మేయర్ పీఠాన్ని అదిష్ఠించాలనే కోరిక.. కోరికగానే మిగిలిపోయేలా ఉంది పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్లలో అద్భుతమైన ఆధిపత్యాన్ని కనపరిచిన బీజేపీ.. అసలు ఓట్ల లెక్కింపు వద్దకు వచ్చేసరికి కుప్పకూలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా 40 నుంచి 50 డివిజన్లకు పరిమితం కావచ్చు.

వైసీపీ ఓటుబ్యాంకుపై ఫోకస్..
బీజేపీ పరాజయం స్పష్టమౌతోన్న వేళ.. అందరి దృష్టీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లింది. వైఎస్ఆర్సీపీ ఓటుబ్యాంకు ఎవరిని ప్రభావితం చేసిందనే చర్చ నడుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేయలేదు. ఒక్క హైదరాబాద్లోనే కాదు.. తెలంగాణ మొత్తం మీద ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా లేదు. గ్రామస్థాయిలో క్యాడర్ అసలే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన ద్వారా లబ్ది పొందిన హైదరాబాద్ వాసులు.. వైసీపీ అంటే సానుకూలంగానే ఉంటున్నారు. ఆ పార్టీ పోటీ చేయకపోవడం వల్ల తమ ఓటును ఎవరికి వేసి ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.

టీఆర్ఎస్ వైపే మొగ్గు..
హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ ప్రజలు లక్షల్లో ఉంటున్నారు. విద్య, ఉద్యోగాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలోని తమ స్వస్థలాల నుంచి తరలివెళ్లి.. హైదరాబాద్లో నివసిస్తోన్న ఏపీ ప్రజలు దాదాపు అన్ని డివిజన్లలోనూ ఉన్నారు. వారిలో వైసీపీ సానుభూతిపరుల సంఖ్య ఓ మోస్తరుగానే ఉండొచ్చు. వారందరూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికే ఓటు వేశారనేది ఈ ఫలితాలతో స్పష్టమౌతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సఖ్యతగా ఉంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ ఓటుబ్యాంకు.. కమలానికి వెళ్తుందనే అంచనాలు కూడా అప్పట్లో వెలువడ్డాయి.

రఘునందన్ వ్యాఖ్యలు దెబ్బకొట్టినట్టేనా
వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులను తమకు అనుకూలంగా, ఓట్ల రూపంలో మలచుకోవడంలో బీజేపీ విఫలమైందనేది స్పష్టమౌతోంది. దానికి ప్రధాన కారణం- బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలేననే అభిప్రాయం ఉంది. దుబ్బాక ఉప ఎన్నికలో కొత్తగా గెలిచిన రఘునందన్ రావు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై చేసిన వ్యాఖ్యల వల్ల వైసీపీ ఓటర్ల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఫలితంగా వారంతా ఏక మొత్తంగా టీఆర్ఎస్కు ఓటు వేసి ఉంటారనే అంచనాలు ఉన్నాయి. రఘునందన్ రావు క్షమాపణ చెప్పినప్పటికీ.. దాన్ని పట్టించుకోలేదని అంటున్నారు.

వైసీపీకి కృతజ్ఙతలు తెలిపిన టీఆర్ఎస్ మద్దతుదారులు..
ఇలాంటి పరిణామాల మధ్య అల్వాల్ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థిని చింతల విజయశాంతి రెడ్డి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు కృతజ్ఞతలు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన విజయానికి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఎంతో సహకరించారని ఆమె పేరు మీద ఓ ట్వీట్ సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. ఏపీ ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తోన్న కొన్ని డివిజన్లతో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. రఘునందన్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు సృష్టించిన వివాదాన్ని బీజేపీ చల్లార్చే పనిలో పడినప్పటికీ.. అది ఫలించలేదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications