పాతబస్తీలో మజ్లిస్ దాడి: అసదుద్దీన్ స్వయంగా, రౌడీలతో దాడి చేశారని కాంగ్రెస్ ఆరోపణ
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. పోలింగ్ మందకోడిగా సాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు కనీసం నలభై శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్లో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2009 కంటే పోలింగ్ నమోదు తక్కువగా ఉందని, అందరూ వినియోగించుకోవాలన్నారు.
Voting % is lower than 2014 elections! Your vote determines the future of Hyderabad. Let's Vote. #GHMCElections
— Lokesh Nara (@naralokesh) February 2, 2016
స్థానిక ఎన్నికలే కదా, ఓటేసిదేమిటి అని అనుకుంటున్నారు.. అది చాలా పొరపాటని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఎర్రమంజిల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడారు.
ఈ దేశం బాగుపడాలంటే స్థానికంగా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, స్థానిక ఎన్నికలను, స్థానికంగా అందాల్సిన సేవలను, మనం కట్టే పన్నులను చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరముందన్నారు.

స్థానిక ఎన్నికలే కదా ఓటు వేసేదేమిటి అనుకోవద్దన్నారు. చలికాలపు బద్ధకాన్ని వదిలేసి తప్పకుండా ఓటేయాలని, మీ కోసం ఓటేయాలని, ఈ దేశాన్ని మార్చుకోవాలంటే ఉద్యమాల ద్వారా, హింస ద్వారా సాధ్యం కాదని, కేవలం ఓటు ద్వారా మాత్రమే సాధ్యమని, ఆ ఆయుధం మీ చేతుల్లో ఉందన్నారు.
I request evryone to Vote for Honest politics today in #GHMCElections
— Jayaprakash Narayan (@JP_LOKSATTA) February 2, 2016
Get Voterslip at https://t.co/ia5Iagrxht #Vote4Whistle #Vote4OneHyd
గ్రేటర్ ఎన్నికల్లో ఉద్రిక్తత
పాతబస్తీలోని మీర్చౌక్ పోలీస్స్టేషన్ ఎదుట తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. చార్మినార్ ఎమ్మెల్యేతో వాగ్వాదం చేసిన ఘటనలో పురానాపూల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌస్ను పోలీసులు అరెస్ట్ చేసి మీర్చౌక్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తదితరులు మీర్చౌక్ పోలీస్స్టేషన్ వద్దకు చేరుకుని గౌస్ను విడుదల చేయాలని ఆందోళన చేట్టారు. పోలీసులు అతనిని విడుదల చేసి మళ్లీ అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
పాతబస్తీలో ఉద్రిక్తత
ఆందోళన చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, రామ్మోహన్ రెడ్డిల పైన మజ్లిస్ కార్యకర్తలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. రామ్మోహన్ రెడ్డి కారు అద్దాలను అసదుద్దీన్ పగులగొట్టారని తెలుస్తోంది. షబ్బీర్ అలీని పక్కకు తోశారని సమాచారం. కాంగ్రెస్ నేతలు తప్పించుకొని వచ్చి గాంధీ భవన్ చేరుకున్నారు.

జాంబాగ్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విక్రమ్ గౌడ్ పైన మజ్లిస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు, ఎన్నికల కేంద్రాల వద్ద తమకు సరైన సౌకర్యాలు లేవని విధులు నిర్వహిస్తున్న వారు ఆందోళనకు దిగారు. ఏవీ కాలేజీలో తమకు సరైన తాగునీరు లేదని విధులు నిర్వర్తించేందుకు వచ్చిన వారు ఆందోళనచేశారు.
మాపై మజ్లిస్ దాడి: షబ్బీర్ అలీ
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గూండాయిజం చేస్తున్నారని, మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రతి బూత్కి తిరిగి రిగ్గింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ సోమవారం ఆరోపించారు.
తమ పార్టీ అభ్యర్థి గౌస్ అదుపులోకి తీసుకోవడంతో తాము మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ వెళ్లామని, తాము స్టేషన్ నుంచి బయటకు వస్తుండగా రెండు వందల మందితో వచ్చిన అసదుద్దీన్.. మా ఏరియాకు మీరు వస్తారా, అంత దమ్ముందా అని బెదిరించారని షబ్బీర్ అలీ చెప్పారు.
పోలీసుల ఎదుటే తమ పైన దాడి జరిగిందన్నారు. అసద్ తన అనుచరులను వెంట బెట్టుకొని వెళ్లి రిగ్గింగ్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఫిర్యాదు చేసిన జర్నలిస్టులను కొట్టారని, ఫొటోలు తీసేందుకు వెళ్లిన ఫొటో గ్రాఫర్ కెమెరా లాక్కున్నారన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేయలేకపోయారన్నారు. మజ్లిస్ గూండాయిజం ఎలా ఉందో చూడాలన్నారు. వాళ్లు ఇంత రౌడీయిజం చేస్తే ఎలాగని ప్రశ్నించారు.
రౌడీమూకలతో స్వయంగా అసదుద్దీన్
పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా రౌడీ మూకలతో తమ పార్టీ నాయకులపై దాడులు చేశారని తెలంగాణ పిసిసి నాయకుడు మల్లుభట్టి విక్రమార్క ఆరోపించారు. అసదుద్దీన్పై, రౌడీలపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రౌడీమూకలను వెంట బెట్టుకుని అసదుద్దీన్ ఓవైసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కారు అద్దాలు పగులగొట్టారని, భయబ్రాంతాలను చేశారని ఆయన ఆరోపించారు.
అసదుద్దీన్ ఓవైసీ దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా నడవాల్సిన ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎంత వరకైనా వెళ్తామని ఆయన అన్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏకపక్షంగా రిగ్గింగ్ చేసినవారిపై కేసులు పెట్టాలని, అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఆయన కోరారు. ఆసదుద్దీన్పై, ఆయన అనుచరులపై కేసులు పెట్టాలని మల్లుభట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
మా ఇలాకాలోకి ఎలా వస్తారంటూ అసదుద్దీన్ ఓవైసీ తన అనుచరులతో దాడి చేశారంటూ పాతబస్తీలో ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications