కరోనా ఎఫెక్ట్.. అమీర్పేట్లో కోచింగ్ సెంటర్స్,హాస్టల్స్ మూసివేతకు ఆదేశాలు..
కరోనా వైరస్ కారణంగా నిత్యం విద్యార్థులు,ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువతీ యువకులతో కిటకిటలాడే అమీర్పేట్ మైత్రివనం ఇక వెలవెలబోనుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో.. కోచింగ్ సెంటర్స్,ప్రైవేట్ హాస్టల్స్ను కూడా మూసివేయాలని జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ గీతా రాధిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు అమీర్పేట్,మైత్రివనం,ఎస్ఆర్ నగర్,సనత్ నగర్ పరిధిలోని దాదాపు 850 హాస్టళ్లు,కోచింగ్ సెంటర్లను రేపటి(మార్చి 18)నుంచి మూసివేయాల్సిందిగా ఉత్తర్వుల్లో ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోచింగ్ సెంటర్స్,హాస్టళ్లను మూసివేసి.. విద్యార్థులను స్వస్థలాలకు పంపించాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఆదేశాలను ఎశరైనా బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం నలుగురికి కరోనా పాజిటివ్ ఉందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గాంధీకి తరలిస్తున్నామని ఆయన వివరించారు. గాంధీలో పూర్తిస్థాయిలో కరోనా టెస్టులు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ వాసులకు ఒక్కరికి కూడా కరోనా సోకలేదని,విదేశాల నుంచి వచ్చిన వాళ్లకే పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అన్ని రాష్ట్రాల కంటే ముందే రాష్ట్రంలో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఎయిర్పోర్టులో 66,162 మందికి స్క్రీనింగ్ చేశామని తెలిపారు.
బుధవారం(మార్చి19) సాయంత్రం నుంచి యూఏఈ విమానాలు నిలిపివేసే అవకాశం ఉందన్నారు. చైనా, ఇరాన్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ నుంచి వచ్చేవాళ్లను వికారాబాద్లోని క్వారంటైన్ సెంటర్కు తరలిస్తున్నామని చెప్పారు. అనుమానిత కేసులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. విదేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను రప్పించేందుకు కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.