ఉయ్యాలే ఉరితాడై... బాలిక మృతి
ఖమ్మం: ఆ బాలిక పాలిట ఉయ్యాలే.. ఉరితాడైంది. ఉయ్యాల ఊగుతుండగా తాడు మెడకు ఉరిపడి బాలిక మృతి చెందింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న పావురాల సాహితి (11) ఉయ్యాల ఊగుతుండగా ఉయ్యాల తాడు ఆమె మెడకు బిగుతుగా చుట్టుకోవడంతో ఆమె మృతి చెందింది.
మంగళవారం ఇంట్లో పత్తి సంచుల్లో తొక్కడానికి ఏర్పాటు చేసిన తాళ్లను ఉయ్యాలగా చేసుకుని ఆడుకుంటుండగా మెడకు ఉచ్చులా బిగుసుకుని సాహితి మృతి చెందిందని స్థానికులు తెలిపారు. సాహితి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
తల్లితో గొడవపడి కుమారుడి ఆత్మహత్య
మెదక్: తల్లితో గొడవ పడి కొడుకు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిన్నకోడూరు మండలం అల్లీపూర్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎండి లాకత్ పాషా(22) హమాలి పని చేస్తున్నాడు.
రెండు రోజులుగా తల్లితో గొడవపడుతున్న పాషా, సోమవారం ఉదయం ఇంటికి రాలేదు. వ్యవసాయ పొలాల వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా గమనించిన రైతులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుమారుడి మృతి పాషా తల్లి కన్నీరుమున్నీరైంది.
ఆలయంలో చోరీ
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్లోని అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు ఆలయంలోని 30 తులాల వెండి ఆభరణాలు, హుండీని అపహరించుకుపోయారు. ఆలయ నిర్వహాకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.