మాజీ ప్రియుడు చేసిన పనికి యువతి ఆత్మహత్య... పత్తి చేనులో శవమై...
మాజీ ప్రియుడు చేసిన పనికి ఓ యువతి జీవితం బలైపోయింది. గతంలో అతన్ని ప్రేమించిన ఆ యువతి... అతని ప్రవర్తన,నడవడిక నచ్చక దూరం పెట్టింది. దీంతో అప్పటినుంచి ఆమెపై కక్ష పెంచుకున్న అతను ఇటీవల ఆమెకు కుదిరిన పెళ్లి సంబంధాన్ని చెడగొట్టాడు. గతంలో ఆమెతో కలిసి చనువుగా దిగిన ఫోటోలను ఆమెకు కాబోయే భర్తకు,అతని కుటుంబ సభ్యులకు పంపించాడు. దీంతో పెళ్లి రద్దవగా... తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సూర్యాపేట జిల్లా బాజిరెడ్డిగూడెం మండలంలో తిమ్మాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గతంలో వంశీతో ప్రేమ...
తిమ్మాపురం గ్రామానికి చెందిన పావని(21) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జీఎన్ఎం నర్సుగా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వంశీ,పావనిలు కొంతకాలం ప్రేమించుకున్నారు. అయితే వంశీ ప్రవర్తన,అతని తీరు నచ్చక పావని అతన్ని పూర్తిగా దూరం పెట్టింది. అప్పటినుంచి వంశీ పావనిపై కక్ష పెంచుకున్నాడు. ఇటీవల పావనికి మరో యువకుడితో పెళ్లి కుదరడంతో... ఎలాగైనా దాన్ని చెడగొట్టాలనుకున్నాడు.
ఫోటోలు లీక్ చేసిన వంశీ...
గతంలో పావనితో చనువుగా దిగిన ఫోటోలను వంశీ ఆమెకు కాబోయే భర్తకు,అతని కుటుంబ సభ్యులకు పంపించాడు. ఆ ఫోటోలు చూసి కలత చెందిన అతని కుటుంబం పావనితో పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకుంది. దీంతో హైదరాబాద్లో ఉన్న పావనిని తల్లిదండ్రులు ఇంటికి పిలిపించారు. వంశీతో వ్యవహారంపై ఆమెను మందలించారు. కొద్దిరోజుల పాటు సూర్యాపేటలోని బంధువుల ఇంట్లో ఉండమని అక్కడికి పంపించారు. పెళ్లి రద్దు కావడం,తల్లిదండ్రులు మందలించడం,బంధువులందరికీ తెలిసిపోవడంతో పావని తీవ్ర మనస్తాపానికి గురైంది.
పత్తి చేనులో శవమై...
ఈ నెల 9న సూర్యాపేటలోని బంధువుల ఇంటి నుంచి బయటకెళ్లిన పావని మళ్లీ తిరిగి రాలేదు. బంధువులు చుట్టుపక్కల గాలించినా లాభం లేకపోయింది.దీంతో పావని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు నమోదు చేశారు.ఇదే క్రమంలో మంగళవారం(డిసెంబర్ 15) తిమ్మాపురం శివారులోని ఎస్సారెస్పీ కాలువ సమీపంలో ఉన్న ఓ పత్తి చేనులో పావని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పురుగుల మందు తాగి పావని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పావని ఆత్మహత్యకు కారణమైన ఆమె మాజీ ప్రియుడు బొడ్డుపల్లి వంశీతో పాటు అతనికి సహకరించిన శ్రీకాంత్, శ్యాంరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.