ముఖం చాటేసిన ప్రియుడు: ప్రేయసి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమించానంటూ నమ్మించి పెళ్లి చేసుకోవడానికి ప్రియుడు నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాదు నగర శివారు బీరంచెరువు నివాసి శివయ్య కుమార్తె సంధ్య(20) హైదరాబాద్లో ఓ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతోంది. గత కొద్దికాలంగా అదే గ్రామానికి చెందిన యువకుడి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే, అకస్మాత్తుగా ఆ యువకుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో వేదనకు గురైన సంధ్య సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి చేరిన ఆమెను 108 వాహనం ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.
రాజేంద్రనగర్ మండలం బీరం చెరువు గ్రామ పరిధిలోని ఇందిరమ్మకాలనీలో పెమ్మిచిట్టి శివయ్య, భాగ్యమ్మ ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటున్నారు. కొన్నిరోజుల క్రితం శివయ్య అనారోగ్యంతో మృతిచెందగా భాగ్యమ్మ తమ ఇద్దరు కూతుళ్లను చదివిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న పెద్ద కూతురు సంధ్య(20) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది.
అయితే, అదే కాలనీకి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి అశోక్తో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి విషయం స్థానికంగా అందరికీ తెలిసింది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో సంధ్య ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నింపంటించుకుంది. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మద్యం మత్తులో స్నేహితుడి హత్య
మద్యం మత్తులో స్నేహితుడినే హతమార్చిన యువకుడి ఉదంతం రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరిలో జరిగింది. ప్రేమ్విజయ్నగర్ కాలనీలో మద్యం మత్తులో శామ్యూల్ను స్నేహితుడు చంద్రశేఖర్ హతమార్చాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.